తెలంగాణాలో రూ.1000కోట్ల పెట్టుబడితో ఇనుప కర్మాగారం
posted on Jul 3, 2014 @ 11:04AM
హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థను దక్కించుకొన్న తెలంగాణాకు మరొక భారీ పరిశ్రమ కూడా తరలి వచ్చింది. ఆస్ట్రియాకు చెందిన యన్.యస్.యల్. కన్సోలిడేటడ్ లిమిటడ్ అనే సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఇనుము కర్మాగారం స్థాపించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీన్ ఫ్రీమ్యాన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిన్న హైదరాబాదులో కలిసి ఒప్పందం దాదాపు ఖరారు చేసుకొంది. దాని ప్రకారం కరీంనగర్ జిల్లా ఆత్మకూరు వద్ద ఒక కర్మాగారం, మెదక్ జిల్లాలో సిద్ధిపేట వద్ద మరొకటి స్థాపించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా దాదాపు 1,000 మందికి ప్రత్యక్షంగా అనేక వందల మందికి పరోక్షంగా ఉపాధి దొరకుతుంది. ఈ రెండు కర్మాగారాలలో ఐరన్ పిల్లట్లు (ఇనుప దిమ్మలు) తయారవుతాయి. ఇవి ఉక్కు కర్మాగారాలకు ముడి సరుకుగా ఉపయోగించబడుతాయి. ఈ రెండు జిల్లాలలో ఏడాదికి దాదాపు 200 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభ్యత ఉంది గనుక మొదటి దశలో కరీంనగర్ కర్మాగారం స్థాపించేందుకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నెల కూడా గడవక మునుపే రెండు భారీ పరిశ్రమలు రావడం చాలా హర్షణీయం. వీటికి అనుబంధంగా మళ్ళీ అనేక చిన్న పెద్ద పరిశ్రమలు అనేకం రావచ్చును. వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా తెలంగాణా రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందడం తధ్యం.