ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు!
posted on Apr 16, 2025 @ 4:16PM
బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన టీ.ప్రభాకరరావు తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తే.. సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు వస్తానంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కేసు దర్యాప్తునకు తాను సహకరించాలంటే తనకు అరెస్టు నుంచి రక్షఏణ కల్పించాలని సుప్రీం కోర్టుకే కండీషన్ పెట్టారాయన అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. తాను భారత్ వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూనే.. తనను అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలివ్వాలని ప్రభాకరరావు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు.
నిందితుడి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ఈ మేరకే తన వాదనలు వినిపించారు. ఇదే కేసులో నిందితుడైన శ్రవణ్ రావును అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విధంగానే ప్రభాకరావుకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.
ఏడాది కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, ఇండియాకు రాకుండా అక్కడే స్థిరంగా ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలూ చేశారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తనను శరణార్ధిగా గుర్తించి అమెరికాలోనే శాశ్వతంగా నివాసముండేలా చూడాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుకున్నాడు. క్యాన్సర్ రోగంతో ఇబ్బందిపడుతున్నందున చికిత్స చేయించుకునేంతవరకు తనను అమెరికా నుండి పంపవద్దనీ కోరారు. ఇలా అమెరికాలోనే ఉండిపోయేందుకు ఆయన చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావు అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. ఇండియా ఆయన పాస్ పోర్టు రద్దు చేసింది.
అన్నిటికీ మించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయనలో ఖంగారు మొదలైంది. ఏ క్షణంలోనైనా అమెరికా నుంచి తాను బలవంతంగా పంపబడటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన ప్రభాకరరావు, తనను అరెస్టుచేయకుండా ఆదేశాలిస్తే ఇండియాకు వచ్చేస్తానని సుప్రింకోర్టుకే కండీషన్ పెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులను గమనించిన ఆయన అమెరికా తనను బలవంతంగా ఇండియాకు పంపడంకంటే ముందే తనంత తానానుగానే భారత్ కు వచ్చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు ముందు బిల్డన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు విచారణకు సహకరించాలంటే అరెస్టు చేయకూడదంటూ తాను పెడుతున్న కండీషన్ ను అంగీకరించాలని ఏకంగా సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.