నిజంగానే పెమ్మ‌సాని..ఈవీఎం ట్యాంప‌ర్ చేయించారా?

 

ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బ‌ట్టీ చూస్తే... ఏపీ పైనా కొంద‌రు గురి పెట్టి.. ఇక్క‌డ ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారు. అందుకు ప్ర‌ధాన కార‌కుడు గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌జ‌ల‌కు క‌నీసం తెలియ‌ని ఇత‌డికి మూడున్న‌ర ల‌క్ష‌ల పై చిలుకు మెజార్టీ ఎలా వ‌చ్చింద‌ని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

అస‌లు పోలింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతుంది? దాని పూర్వాప‌రాలు ఏంట‌ని ఒక సారి చూస్తే..   పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్.. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మ్యానేజ్‌మెంట్, ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, లైసనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ ఇలా పోలింగ్ క‌మ్ కౌంటింగ్ లోని వివిధ స్థాయిల‌లో ఉంటారు అధికారులు. 

ఆ ప్ర‌క్రియ‌లు కూడా అంతే స‌మానంగా పెద్ద ఎత్తున ఉంటాయి.  గ్రామపంచాయతీ సర్పంచ్-  డైరెక్ట్/ ఇండైరెక్ట్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్-  డైరెక్ట్ /ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారు చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. ఇది అత్యంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. విప‌రీత‌మైన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త వ‌హిస్తుంటారు.

ఈవీయం లు అంటే,  కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్  లు.. ఇవి అంత తేలిగ్గా హ్యాకింగ్ కు గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్, ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఇవ‌న్నీ క‌ల్పిత గాథ‌లు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో మూడు స్థాయిల్లో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు / ఉద్యోగులు, ఈవీయం వివిధ ప్రత్యేక నంబర్లను కలిగి ఉన్న ఈ మూడు పరికరాలు  లు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీ ప్యాట్ లు ఏ ప్యాటర్న్ లో, ఏ పోలింగ్ స్టేషన్ కు వెళతారో / యో అలాట్ చేసిన వారికే తెలియదు. 

అక్కడ, ఆ పోలింగ్ స్టేషన్ లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీయం కు సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెబుతుంది. పోలైన ఓట్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు / అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది.

పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్ల, అబ్జర్వర్ లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు .. సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు పోలీసు బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడినుంచి అదేబ‌రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూం లో తాళం వేసి, సీలు వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూంకు సీలువేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు / ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వీడియోగ్రఫీ చేస్తారు.

ఒకే తలుపు ఉండి, అన్ని కిటికీలను మూసేసి  ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టిన నిర్మాణం చేసి సీల్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి- షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ రూం కు ఇరవైనాలుగు గంటలూ పోలీసు పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్ ను తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ, తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోలు యూనిట్ వాడుకునే కరెంట్ అతి తక్కువ. 

కంట్రోలు యూనిట్ లో ఓటును అలాట్ చెయ్యగలం అంతే. బ్యాలెట్ యూనిట్ లో ఓటు వినియోగం తరువాతే మరోసారి కంట్రోలు యూనిట్ పని చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే కంట్రోలు యూనిట్, బ్యాలెట్ యూనిట్ ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే రెండు కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీలులేకుండా ఉండిపోతాయి. అందువల్ల‌  ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీలులేదు.ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు క‌నిపించవు. అది అసాధ్యం.

ఈవీయంలను మ్యానేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు వందశాతం గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెజారిటీ ఆ అధికార పార్టీకే రావాలి కదా... మరి అలా జరగటం లేదు కదా. ఫలితాలు తలకిందులై అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీలు యంయల్ఏ, యంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయి అంటే ఈవీయంలు చక్కగా పని చేస్తున్నాయనే క‌దా అర్ధం.

ఇక్క‌డ మ‌రో లాజిక్ కూడా చాలా మందికి పీకుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి నిజంగానే ఈవీఎంల‌ను టాంప‌ర్ చేసి గెలిచి ఉంటే.. మ‌రి కేంద్రంలో బీజేపీ కూడా అఖండ మెజార్టీతో విజ‌యం సాధించాలిగానీ.. 420 సీట్లు టార్గెట్  పెట్టుకుంటే 240కి ప‌రిమితం కావ‌డ‌మేంట‌న్న‌ది మ‌రి కొందరి ప్ర‌శ్న‌.

మ‌రో మాట కూడా ఇదే విష‌యంలో రాసుకోవ‌చ్చు. గ‌తంలో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న రెడ్డి సైతం 151 సీట్ల అఖండ మెజార్టీతో గెలిచిన‌పుడు బాబు ఇలాగే అన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ ఆ వాయిస్ అందుకుంది. మ‌రి 151 సీట్లు వ‌చ్చిన‌పుడు రాని ఈవీఎం డౌట్ ఇప్పుడే రావ‌డంలో అర్ద‌మేంటి.

పెమ్మ‌సాని వంటి వారి ముక్కూ మొహం ఓట‌ర్ల‌కు తెలీదంటున్న‌పుడు జ‌గ‌న్ హ‌యాంలో గెలిచిన వారి ముక్కూ మొహం మాత్రం ఎవ‌రికి తెలుసు? పెమ్మ‌సాని అన్నా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవల్లో బ‌యో టెక్ బిజినెస్ చేసిన బిజినెస్ మెన్. మ‌రి నందిగం సురేష్ వంటి వారు ఎంపీ అయిన‌పుడు ఇదే ప్ర‌శ్న వీరంద‌రికీ ఎందుకు రాలేదు? ఇలా లాజిక్కులు లాక్కుంటూ పోతే.. తెగేది లేదు తెల్ల‌వారేది లేద‌న్న‌ది ఒక విశ్లేష‌ణ‌గా తెలుస్తోంది. మ‌రి మీరేమంటారు???


 
 

పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://youtu.be/T_mYTVE6Wgs

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.