తన కోసం మొక్కుకున్న వృద్ధురాలి కోసం పవన్ ఏం చేశారో తెలుసా?
posted on May 10, 2025 7:01AM
పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత.. సినీ హీరో.. ఆయనది రాజకీయాలలోనైనా, సినిమాలలోనైనా ఒక ప్రత్యేక స్టైల్. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పినా, డ్యాన్సులకు స్టెప్పులేసినా, రాజకీయాలలో ఉన్నదున్నట్లు మాట్లాడినా, ఆ మాటలు కొన్ని సార్లు సొంత పార్టీ, సొంత కూటమి నేతలకే ఇబ్బంది కలిగించినా డోన్ట్ కేర్.. తనకు ఏదనిపిస్తే అది చేస్తారు. ఎ చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు అంతే. ఈ ప్రత్యేకతే ఆయనను రాజకీయాలలోనైనా, సినిమాలలో అయినా మిగిలిన వారి కంటే ఒకింత స్పెషల్ గా నిలుపుతోంది.
తాజాగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక వృద్ధు రాలిని మంగళగిరిలోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. 96 ఏళ్ల ఆ వృద్ధురాలి పేరు పోతుల పేరంటాలు. ఇంతకూ ఆమెను పవన్ కల్యాణ్ ఎందుకు ఆహ్వానించి అతిథిమర్యాదలతో విందు ఇచ్చారంటే..
గత ఏడాది జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. విషయం అది కాదు..పిఠాపురం నుంచి పవన్ గెలవాలని ఈ పోతుల పేరంటాలు మొక్కుకున్నారు. ఈమెది పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలానికి చెందిన ఇసుకపల్లి. ఇంతకీ పోతుల పేరంటాలు మొక్కు ఏమిటంటే.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తన కులదైవం వేగులమ్మకి గరగ చేయిస్తాననీ, పొర్లు దండాలు పెడతానన్నది ఆమె మొక్కు. సరే పవన్ కల్యాణ్ విజయం సాధించారు. అలా ఇలా కాదు.. అద్భుత మెజారిటీతో. దాంతో పేరంటాలు తన మొక్కు తీర్చుకున్నారు. పేదరాలు కావడంతో వేగులమ్మ తల్లికి గరగ చేయించడం ఆమెకు అంత సులువు కాదు. అందు కోసం ఆమె చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. తనకు వచ్చే పెన్షన్ సొమ్ములలో పొదుపు చేసి మొత్తం మీద 27 వేల రూపాయలు కూడగట్టి గరగ చేయించి అమ్మవారికి సమర్పించి, పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంది.
ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమెను అభినందించో, ఆర్థిక సహాయం చేసే ఊరుకుంటే సరిపోదని భావించారు. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, పక్కన కూర్చుని కొసరి కొసరిభోజనం వడ్డించారు. ఆమెకు చీర పెట్టి, లక్ష రూపాయలు నగదు ఇచ్చారు. అంతేనా ఆమెకు బయటవరకూ వెళ్లి మరీ వీడ్కోలు పలికారు. ఇది తెలిసిన వారంతా దటీజ్ పవన్ అంటూ అభినందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరంటాలుకు స్వయంగా భోజనం వడ్డించి ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేస్తున్నఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.