నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

 

“నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే.

నేతాజీ సుభాష్ చంద్రబోస్..


నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.


 స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి..


రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.  

ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..

 మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.

                                         *రూపశ్రీ.

జనవరిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా  ఉంటుందో తెలుసా?

జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.   పరిణితి.. జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి. నిరాడంబరత, ఆదర్మమార్గం.. జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు. వ్యక్తీకరణ..  వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది. భయం.. కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.   బాధ్యత.. ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.                                          *రూపశ్రీ.

పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి..!

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వెనుకటి కాలంలో పెళ్లి అంటే కేవలం పెద్దల నిర్ణయం. కానీ నేటి తరంలో పెళ్లి చేసుకునే వారిదే మొదటి, చివరి నిర్ణయం కూడా.. పెళ్ళి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. దీని వల్ల ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీని ఆధారంగా పెళ్లి గురించి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. అంచనాలు.. పెళ్ళికి ముందు చాలామంది తమకు వచ్చే భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఈ అంచనాల గురించి ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఇది ఎవరి ఆలోచన ఎలా ఉంది? ఎలాంటి లైప్ కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం.. భారతదేశంలో ఇంటి బాధ్యత చూసుకునేది మగవారే.. అందుకే వారికి ఉద్యోగం తప్పనిసరి. అయితే  అమ్మాయిలు చదువుకున్నా,  ఉద్యోగం చేస్తున్నాపెళ్లి తర్వాత ఈ పరిస్థితులు మారుతుంటాయి.  అందుకే పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా? అనే విషయాలు ముందుగానే చర్చించుకోవడం మంచిది. వివాహం తర్వాత వీటి గురించి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. బాధ్యతలు.. ఇంటి బాధ్యతలు, ఆర్థిక భాద్యతలు,  పిల్లల బాధ్యతలను ఎలా విభజించాలి? వాటిని ఇద్దరూ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పెళ్లికి ముందు చర్చించుకోవాలి.  దీని వల్ల ఇద్దరూ తమ బాధ్యత చక్కగా నెరవేర్చుకోగలరు. ఆర్థిక ప్రణాళిక.. బాగస్వామి ఆర్థిక అలవాట్లు,  పొదుపులు, ఖర్చు విధానాలను అడిగి తెలుసుకోవాలి. ఎంత సంపాదన ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత గొడవలను, విబేధాలను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది. పిల్లల ప్లానింగ్.. పెళ్లి కాకుండానే పిల్లల గురించి మాట్లాడటం కాస్త విచిత్రం అనుకుంటారు అందరూ. కానీ నేటితరం వారు పిల్లల బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అందుకే ఎంత మంది పిల్లలను ప్లానింగ్ చేసుకోవాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? పిల్లలను ఎలా పెంచాలి? పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?  వంటి విషయాలు చర్చించుకోవాలి. ఇది భార్యాభర్తల బందాన్ని బలపరుస్తుంది. వివాదాలు.. ప్రతి ఒక్కరికి కోపం, అసహనం,  చిరాకు, గొడవ,  సమస్య వంటివి ఎదురైనప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవాలి.  దీని వల్ల వివాహం తర్వాత గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పిరిష్కరించుకోవాలో ఇద్దరికీ అర్థం అవుతుంది. కుటుంబ సంబంధాలు.. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ అత్తమామలతో ఎలా ఉండాలి? ఎలాంటి అనుబంధం కోరుతున్నారు? వంటివి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే వివాహం తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు. ఇష్టాలు, అయిష్టాలు.. కాబోయే భాగస్వామి ఇష్టాలు, అభిరుచులు,  అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు వంటివి పెళ్లికి ముందు తెలుసుకోవాలి.  వైవాహిక బంధం ఎక్కువగా ఒకరి ఇష్టమైనది మరొకరు చేయడం అనే పని ద్వారా బలపడుతుంది.  దీని పల్ల ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం అవుతుంది.  అందుకే ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవాలి.                                *రూపశ్రీ.

అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!

  మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి.  వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..   ప్రవర్తన.. అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం.  అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.   అవసరాలు.. కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు.  వారికి  కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.     నిజాలు.. మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి  ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా  అబద్దాలు చెబుతుంటే  అలాంటి వారిని నమ్మడం కష్టం.   సమయం.. ప్రేమలో ఉన్నవారు,  ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు.  వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.   మాటలు.. చేష్టలు.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు,  తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు.  లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.   సహాయం.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు.  అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.   స్వప్రయోజనం.. అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.   నియంత్రణ.. అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.   బాధ్యత.. ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..   ఎమోషన్స్.. అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా ,  అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.   - రూపశ్రీ  

కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!

  కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని,  ఓర్పుతో వాటిని అధిగమించాలి.. తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే.  ప్రతి సారి ఇలాంటివి  మామూలే అనుకోకుండా కనీసం   కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం  గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది.  ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..   ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం.. పైన పేర్కొన్న విషయాన్ని  స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల  శక్తి, సమయం,  డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.   బరువు మాత్రమే కాదు.. చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం,  పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.   నిద్ర ముఖ్యం.. కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు,  ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు..  ఇది మాత్రమే కాకుండా  గాడ్జెట్‌లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి  ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది  నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు,  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.   శ్వాస- ప్రాణ శక్తి.. ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు,  కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి.  సూర్యకాంతిలో గడపడం,   స్వచ్ఛమైన గాలి ఉన్న చోట  నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.   ప్రతిభ- సామర్థ్యం.. ప్రతి వ్యక్తి తమలో ఉన్న  ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా  జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో,  అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి.  ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.   - రూపశ్రీ  

నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!

ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు.  నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు.  వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు.  నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు.  వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.  దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు.  తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి,  తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు.  కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం.  మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. తప్పుల తిరస్కారం..   నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు.  వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని  తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా  జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా  గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు. ఎదుటి వ్యక్తిని కించపరచడం.. నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి  అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి  లేని వ్యక్తులు గానూ,  డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు.  వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి,  వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా  తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. తామే బాధితులుగా.. నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని  వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా  వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని  ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు. తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి వ్యక్తులు  విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న  విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు. తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి.. నార్సిసిస్టులు  తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా  చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు.  వారు అబద్ధం  చెప్పి ఎదుటివారిని  అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ  ఎదుటి వారిని అనుమానిస్తారు. ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు.. కొన్నిసార్లు ఎదుటివారికి బాధ  కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.   పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్‌తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం.  ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు.  వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు.  ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే  మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!

భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు.  అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు.  పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు.  ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని  నాశనం చేసే తప్పులు  ఏంటో తెలుసుకుంటే.. అనుమానం.. ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు.  లైఫ్ పార్ట్నర్  ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు.  అనుమానం  అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది. ఎగతాళి.. ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు   భాగస్వామి మనస్సులో నెమ్మదిగా  ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి,  రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు. పోలిక.. భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం.  ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది. పంతం.. నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది. మౌనం.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు.  అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి. పాత విషయాలు.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు.  ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు.  ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి. మొబైల్.. నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా  ఫోన్ లో  నిమగ్నమవుతుంటారు.  దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది. స్పేస్.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే.  ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం.  24గంటలు అతుక్కుని ఉండటం,  భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది. సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం  రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి,  క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న  ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.                               *రూపశ్రీ.

మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!

కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.

ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!

కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ. ఇప్పుడైతే తొందరలోనే కొత్త ఏడాది రాబోతోంది.  క్యాలెండర్ తో పాటు తమ జీవితం కూడా మారాలని కొండంత ఆశ పెట్టుకుని ఉంటారు అందరూ. మరీ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ కంటే ఎక్కువగా తమ పిల్లల జీవితం గురించే ఆలోచిస్తారు.  తమ పిల్లలు సంతోషంగా ఉండాలని,  చదువులో, కెరీర్ లో విజయం సాధించాలని కోరుకుంటారు. చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ కొత్త ఏడాదిలో తమ పిల్లలు సక్సెస్ గా ముందుకు సాగాలని కోరుకుంటారు.  అయితే పిల్లలు కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలన్నా, వారి భవిష్యత్తు మరెంతో గొప్పగా  ఉండాలన్నా  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. రీడింగ్.. చదవడం వల్ల పిల్లల ఊహ, భాష,  ఆలోచన అన్నీ బలపడతాయి. రోజూ చదివే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి రోజుకు కనీసం 30 నిమిషాలు రీడింగ్ అలవాటు చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి.  ఇందుకోసం ఏదైనా చదవవచ్చు.  కథ, కామిక్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్  అందించే పుస్తకం.. ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు. స్క్రీన్ సమయం.. కొత్త సంవత్సరంలో పిల్లలు  ఫోన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేయాలి. పగటిపూట  నిర్ణీత  సమయం కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర,  కంటి చూపు దెబ్బతింటుంది. పడుకునే గంట ముందు  మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉండటం  కూడా చాలా ముఖ్యం. నిద్ర..  ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఫాలో కావల్సిన మంచి అలవాటు ఏంటంటే..  సరైన సమయానికి  పడుకుని, సరైన సమయానికి మేల్కోవడం. పిల్లల మానసిక అభివృద్ధికి చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాత్రి సరైన సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నేర్చుకోవడం.. నేర్చుకునే అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుంది. పిల్లలు కొత్త పదజాలం, చిత్రలేఖనం, సంగీతం లేదా క్రీడలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు చాలా సహకారం అందించాలి. నడవడిక.. ఎవరికైనా సరే ధాంక్స్  చెప్పడం, పెద్దలను గౌరవించడం,  సహాయం చేయడం వంటివి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసే  అలవాట్లు. ఇతరులను గౌరవించడం, మంచి మర్యాదలను అలవర్చుకోవడం చేయాలి. ఆహారం.. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసిరి.  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.   జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు,  ఇంట్లో వండిన ఆహారాన్నితీసుకోవాలి. పిల్లల రోగనిరోధక శక్తి,  పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం. వ్యాయామం.. ఆటలు..  పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం, ఆటలు చాలా బాగా సహాయపడతాయి. పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోవడం ప్రోత్సహించాలి.  ఇది  పిల్లలను సామాజికంగా కలిసిపోయేలా చేస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిల్లలకు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ అవసరం. అందువల్ల పిల్లలు తమ శారీరక వ్యాయామాన్ని,  బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి.  దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.                                    *రూపశ్రీ.

క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

క్రిస్మస్ అనేది  క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న   జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి,  మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది.  క్రిస్మస్ పండుగ రోజున ప్రతి  ఇల్లు దీపాలతో,  నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.  అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు.  ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు.  అయితే డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగ రోజు స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది? తెలుసుకుంటే.. డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ,  త్యాగం యొక్క మార్గాన్ని చూపిం చాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు. క్రిస్మస్ సంప్రదాయాలు క్రిస్మస్ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువైన యేసు జీవితాన్ని, ఆయన  బోధనలను గుర్తుచేసుకుంటారు.  క్రైస్తవుల ప్రతి ఇంట్లో  క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు, కరోల్స్ పాడతారు,  కేకులు కట్ చేస్తారు. పిల్లలలో శాంతా క్లాజ్ ఆనందంగా గడుపుతారు.  క్రిస్మస్ ముఖ్యంగా  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి  పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా  ఈ పండుగ పేదలకు సహాయం చేయడానికి,  దాతృత్వానికి దానం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. క్రిస్మస్ రోజున స్నేహితులకు, పరిచయస్తులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.   స్నేహితులకు, పరిచయస్తులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి చాక్లెట్లు, ప్లం కేకులు,  కుకీలను క్రిస్మస్ కోసం సాంప్రదాయంగానూ,  గొప్ప  బహుమతులుగానూ భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కేకులు,  కుకీలు స్నేహాలకు తీపిని జోడిస్తాయి,  సాన్నిహిత్యాన్ని బలపరుస్తాయి. గ్రీటింగ్ కార్డ్, ఫోటో ఫ్రేమ్ లేదా  ఏదైనా చాలా సొంతంగా తయారు చేసిన బహుమతులు  చాలా ప్రత్యేకమైనవి. అలాంటి బహుమతులు సమయాన్ని,  ఓపికను,  కష్టాన్ని స్నేహితుల కోసం వినియోగిస్తే చాలా మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుతాయి. పుస్తకాలను చాలా గొప్ప  బహుమతిగా పరిగణిస్తారు. స్నేహితుడి ఆసక్తికి సంబంధించిన ప్రేరణాత్మక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వవచ్చు.    పుస్తకం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సువాసనగల కొవ్వొత్తులు,  అలంకరణ వస్తువులు, షోపీస్‌లు,  క్రిస్మస్ నేపథ్య అలంకరణ వస్తువులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ బహుమతులు పండుగకు గల ఉద్దేశ్యాన్ని  మరింత ప్రత్యేకంగా చేస్తాయి. పర్సనల్ గా ఇచ్చి పుచ్చుకునే బహుమతులు కూడా క్రిస్మస్ లో ప్రాధాన్యత కలిగి ఉంటాయి.  మగ్గులు, కుషన్లు, డైరీలు, పేరు లేదా ఫోటోతో కూడిన కీ చైన్‌లు వంటి పర్సనల్  బహుమతులు  బాగుంటాయి. పైన పేర్కొన్న బహుమతులు అవతలి వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక బహుమతులు ఇవ్వాలంటే  వారికి బొమ్మలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్ లేదా పెయింటింగ్ కిట్‌లను బహుమతిగా ఇవ్వడం చాలా మంచి సెలెక్షన్ అవుతుంది. ఇది పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. -రూపశ్రీ

ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?

  ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి.  వారి వారి సాంప్రదాయాల పరంగా మార్పులు ఉంటాయి.  అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో కూడా  క్రిస్మస్ లో కూడా ఒక ప్రత్యేకత, వింత ఉంది.  అదే శాంతా క్లాజ్.. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ వేడుక వచ్చిందంటే పిల్లలు అందరూ శాంతా క్లాజ్ కోసం ఎదురు చూస్తారు.  శాంతా క్లాజ్ పిల్లలకు బోలెడు బహుమతులు తెస్తాడని నమ్ముతారు.  అయితే ఐస్లాండ్ లో మాత్రం శాంతా క్లాజ్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలలో శాంతా క్లాజ్ ఒక్కడే.. కానీ ఐస్లాండ్ లో మాత్రం 13మంది శాంతా క్లాజ్ లు ఉంటారట. జానపద కథ ఏం చెప్తుందంటే.. ప్రతి దేశంలో జానపద కథలు ఉన్నట్టే ఐస్లాండ్ లోనూ జానపద కథలు ఉన్నాయి. అక్కడి జానపద కథల ప్రకారం అక్కడి శాంతా క్లాజ్ లను యూల్ లాడ్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. ఈ 13మంది గురించి మొదటగా 1862లో ప్రస్తావించబడిందట. రచయిత జాన్ అర్నాసన్ ప్రసిద్ధ గ్రిమ్స్ నుండి ప్రేరణ పొంది జానపద కథలను సేకరించడం మొదలు  పెట్టాడు. 1932లో ఐస్లాండిక్ కవి జోహన్నెస్ ఉర్ కోట్లమ్  యూల్ లాడ్స్ అనే కవితను క్రిస్మస్ ఈజ్ కమింగ్ అనే పుస్తకంలో ప్రచురించాడు.  ఇది వారి పేర్లు, వ్యక్తిత్వాలతో పాటు వారి గురించి ఒక నమ్మకాన్ని సెట్ చేసింది. యూల్ లాడ్స్ ప్రకారం 13మంది అన్నదమ్ములు గ్రైలా అనే ట్రోల్ కు జన్మించారట. కానీ కాలక్రమేణా వారి పిల్లలు, వారసులు అందరూ ఉదారంగా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్లారచ.  దీని వల్ల వారికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. చివరకు వారికి ఏమీ మిగలకుండా పోయిందట.  క్రిస్మస్ కు ముందు ప్రతి రాత్రి ఈ 13మంది యూల్ లాడ్స్ పిల్లలను అందరినీ సందర్శిస్తారట. ఐస్లాండ్ జానపద కథల ప్రకారం,  ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన ప్రతి చిన్న పిల్లవాడు యూల్ లాడ్స్ నుండి  ఒక చిన్న బహుమతి పొందుతాడట.  అంతేకాదు.. అల్లరి పిల్లలకు పచ్చిగా ఉన్న  లేదా కుళ్లిన బంగాళాదుంపను ఇస్తారట.  అక్కడి పిల్లలు క్రిస్మస్ బహుమతి స్వీకరించడానికి కిటికి గుమ్మం మీద ఒక  షూ ను ఉంచుతారట.  ఇదీ ఐస్లాండ్ లో క్రిస్మస్ విశేషం.                                         *రూపశ్రీ.