షాక్ మీద షాక్‌.. పాక్ షేక్!

ఓడించడమే యుద్ధం లక్ష్యం! ఇప్పుడు పాకిస్థాన్ విషయంలోనూ ఇండియా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ప్రతీకారమంటే విధ్వంసం మాత్రమే కాదు.. కోలుకోలేని దెబ్బకొట్టడం. భారత్ కొడుతున్న ఒక్కో దెబ్బకు  పాక్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. షాక్ మీద షాక్ తగులుతుండటంతో షేక్ అవుతున్నది.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా  భారత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు.. పాకిస్థాన్‌కు మతిపోతోంది. ఇండియా మొదలు పెట్టిన ట్రేడ్‌ వార్‌తో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఆ దేశం. 

పాకిస్థాన్‌ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే.. పాక్‌ను మరో చావుదెబ్బ కొట్టింది ఇండియా. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందనీ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  దీని ప్రకారం పాకిస్థాన్ నుంచి భారత్ ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోదు. అలాగే.. పాకిస్థాన్‌కి కూడా అన్ని రకాల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులతో పాటు పరోక్ష దిగుమతుల్ని కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం వాణిజ్య, ఆర్థిక రంగాల్లో పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన దీర్ఘకాలిక వ్యూహాల్లో ఓ భాగంగా చెబుతున్నారు.  ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం, అట్టారీ-వాఘా సరిహద్దుని మూసేయడం, పాకిస్థాన్   రాయబార కార్యాలయ సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌ని మరో గట్టి దెబ్బకొట్టిందనే చెప్పాలి. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ నుంచి తగులుతున్న ఒక్కో దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వాణిజ్య యుద్ధం కూడా తీవ్రమైంది. ప్రజా ప్రయోజనం, జాతీయ భద్రత ఆధారంగా.. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులన్నింటినీ భారత్ నిషేధించింది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు కేంద్రం.. అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ని మూసేశారు. దాంతో.. భూమార్గం ద్వారా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. దాంతో వాణిజ్య రవాణాకు సంబంధించిన విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా పాకిస్థాన్ నుంచి అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోయింది.  ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య  నిషేధం ఆ దేశంపై తీవ్రాతితీవ్రమైన ప్రతికేల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.  

భారత్ తాజా నిర్ణయంతో   ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులకు పాకిస్థాన్ లో తీవ్రమైన కరత ఏర్పడటం ఖాయం.  గత ఏడాది పాకిస్థాన్ నుంచి భారత్‌కు సుమారు 305 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కన చూస్తే.. పాకిస్థాన్‌ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక  భారత వస్తువులు.. దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుతున్నాయి. పాకిస్థాన్ కూడా భారత వాణిజ్య ఆంక్షలను అధిగమించేందుకు.. కొన్ని వస్తువుల్ని దుబాయ్, సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా పంపుతోంది. ఇలా పరోక్షంగా జరిగే వాణిజ్యం విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నిషేధంతో ఇక ఈ తరహా వాణిజ్యం కూడా ఆగిపోనుంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. 2023-24 మధ్య అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్-పాక్ మధ్య 3 వేల 887 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌లో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం. ఎగుమతి అవకాశాలు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తనున్నాయి. 

భారత్ - పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు 2019 నుంచే దాదాపుగా స్తంభించాయ్. పుల్వామా దాడి తర్వాత.. రెండు దేశాల మధ్య అంతంతమాత్రంగానే వాణిజ్యం కొనసాగుతోంది. అయినప్పటికీ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల ద్వారా ఇన్నాళ్లూ అనధికార వాణిజ్యం జరిగింది. ఇప్పుడు, ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే ఎగుమతులు, దిగుమతులపై భారత్ నిషేధం విధించింది.   ఈ వ్యూహాత్మక చర్యలు పాకిస్థాన్‌లోని ఉత్పత్తిదారులు, వ్యాపారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి పతనం అంచుకు నెట్టేసింది. సరిహద్దులు మూసేయడం, సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించడం లాంటి చర్యలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలు చేయడం ఖాయం.