పాక్ టూరిజం టు టెర్ర‌రిజం!.. ఏ వార్ ఫేర్

అవి మ‌న‌కు స్వాతంత్రం వచ్చిన రోజులు. భార‌త దేశంలోనే అతి పెద్ద సంస్థానం జ‌మ్మూ- కాశ్మీరం.  క‌శ్య‌ప మ‌హా ముని పేరిట వెల‌సిన  కాశ్మీర్ కి రాజు రాజా హరిసింగ్. వెళ్తూ వెళ్తూ బ్రిటీష్ ఇండియా చేసిన ప‌ని.. ఎవ‌రి  స్వేచ్ఛ‌ మేరకు  వారు భార‌త్- పాక్.. లలో ఏ దేశంలోనైనా అయినా క‌ల‌వ‌చ్చ‌న్న మెలిక పెట్టడం.  

అప్ప‌టికి స్వాతంత్రం పొందిన దేశాలు భార‌త్, పాక్, శ్రీలంక‌, బ‌ర్మా. వీటిలో భార‌త్- పాక్ మ‌ధ్య ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు చాలానే. దానికి తోడు ఇక్క‌డున్న మ‌రో మెలిక ఏంటంటే.. హిందుస్థాన్ లో హిందువులు, పాకిస్థాన్ లో పాకిస్థానీయులు అంటే ముస్లిములు ఉండాల‌న్న‌ది ఒక ష‌ర‌తు కాగా.. మ‌న భార‌త దేశంలో ఇంకా మూడొంతుల్లో ఒక వంతు ముస్లిములు అలాగే ఉండి  పోయారు.  అయినా స‌రే ఇరు వ‌ర్గాల మ‌ధ్య హిందూ- ముస్లిం- సిక్ వంటి జాతుల మ‌ధ్య బీభ‌త్స‌మైన సంఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ్గా ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో 2 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతే స్థాయిలో నిరాశ్ర‌యులు అయ్యారు కూడా.

ఈ లోగా రాజాహ‌రిసింగ్ నేతృత్వంలోని కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల‌పైకి గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపులు పాక్ సైన్యం సాయంతో  దాడులు చేశారు. వీరి బాధ ఏంటంటే రాజా హ‌రిసింగ్ ఎక్క‌డ త‌న సంస్థానాన్ని భార‌త్ లో క‌లిపేస్తాడో అన్న‌దే. పాక్ అత్యుత్సాహం, గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపుల దుందుడుకు త‌నం పెచ్చరిల్లి రాజా హ‌రిసింగ్ కి చిరాకు తెప్పించాయి. ఒక  ర‌కంగా  ఆందోళ‌న క‌లిగించాయి. ఇలాంటి వారి నుంచి ఈ  చ‌ల్ల‌టి క‌శ్మీరం ర‌క్ష‌ణ పొందాలంటే వీరికంటే అమేయ ప‌రాక్ర‌మ‌మైన భార‌త్ ప‌రిధిలో ఈ దేశం ఉండాల‌ని భావించారు రాజా హ‌రిసింగ్. అందులో భాగంగా భార‌త్ వైపే క‌శ్మీర్ సంస్థానం క‌లిసేలా ఒప్పంద పాత్రాల‌పై సంత‌కాలు చేశారు. దీంతో ఐక్య రాజ్య స‌మితి  సైతం తీర్మానం చేసింది.

ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కు. పాకిస్థాన్ కి ఒళ్లు మండింది. క‌శ్మీర్ లో అత్య‌ధికంగా ఉన్న ముస్లిమ్ జ‌నాభాను  అనుస‌రించి చూస్తే.. ఈ ప్రాంతం క‌ల‌వాల్సింది పాక్ లో. అంతే కాకుండా వారి మ‌రో కాంక్ష ఏంటంటే.. క‌శ్మీరం భూత‌ల స్వ‌ర్గం. స్విట్జ‌ర్లాండ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ప్రాంతం కానీ త‌మ గుప్పెట్లో ఉంటే.. మ‌నం ఎంచ‌క్కా ప‌ర్యాట‌కం ద్వారా విశేష‌మైన ఆదాయాన్ని స‌ముపార్జించుకోవ‌చ్చు. అన్న‌ది వీరి ఆశ. ఆశ‌యం.

అయితే ఈ ఆశ‌ల‌పై రాజా హ‌రిసింగ్ నీళ్లు కుమ్మ‌రించ‌డంతో వీరికి ఆ నాటి  నుంచి ఈ నాటి వ‌ర‌కూ.. ఆ కోరిక అలాగే ఉండి పోయింది. కార‌ణ‌మేంటంటే వారికి ద‌క్కిన భూభాగమంతా ఎడారిని త‌ల‌పిస్తుంది. పేరుక‌ది ప‌విత్ర దేశ‌మే కానీ అంతా అప‌విత్రం కావ‌డానికి గ‌ల కార‌ణం.. ఆ దేశానికంటూ  సొంత కాళ్ల మీద నిల‌బ‌డే స‌త్తా లేక పోవ‌డం. 

సింధూజ‌లాలు ఎక్క‌డో పుట్టి ఎక్క‌డి  నుంచో త‌మ దేశంలో ప్ర‌వ‌హిస్తేగానీ.. ఇక్క‌డ వారి  పంట‌ల‌కు దిక్కూ మొక్కూ లేదు. అంతే కాదు ఈ జ‌లాల ద్వారా పండే పంట‌లతో ఆ దేశ జీడీపీలో 24 శాతం ఆదాయం మాత్ర‌మే ల‌భిస్తుంది. అదే కాశ్మీర్ కూడా త‌మ సొంత‌మైతే.. వారు ప‌ర్యాట‌కంగానూ విశేష‌మైన ఆదాయ వ‌న‌రుల‌ను పొంద‌వ‌చ్చు. ఇక్క‌డే పాక్ ఆశ‌ల‌కు భారీగా చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది రాజా హ‌రిసింగ్.

అలాగ‌ని ఇది కేవ‌లం ఆయ‌న నిర్ణ‌య‌మ‌ని అనుకోవ‌డానికి వీల్లేదు. ఆ నాడు పాక్ ఇస్లామిక్ ట్రైబ‌ల్ గ్రూపుల‌కు త‌న ద‌ళాల సాయం అందించ‌కుండా ఉండాల్సింది. కానీ, రాజాహ‌రిసింగ్ హిందువు కావ‌డం. దానికి తోడు ఈ ప్రాంతం పేరు కూడా ఒక హిందూ ముని క‌శ్య‌పుడి పేరిట ఉండ‌టంతో.. ఆయ‌న కూడా హిందువులు అత్యధికంగా  ఉన్న హిందుస్తాన్ లో క‌శ్మీర్ క‌ల‌వ‌డ‌మే స‌మంజ‌సం అనుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని క‌శ్మీరీ పండిట్ల‌ను బ‌ల‌వంతానా ఏరి పారేసింది క‌శ్మ‌రీ ముస్లిములు. అదే త‌ర్వాతి రోజుల్లో క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా వ‌చ్చేలా చేసింది. 

పాకిస్థానీయులు ఇక్క‌డే చావు దెబ్బ తిన్నారు. వారు త‌మ అత్యుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న  చేయ‌కుండా.. దౌత్య ప‌రంగా ఎంతో సంయ‌మ‌నంతో ప్ర‌వ‌ర్తించి ఉండాల్సింది. ఆచీ- తూచి వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింది. రాజు మీద ఒత్తిడి తేకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే.. వారి బిహేవియ‌ర్ న‌చ్చి ఉంటే రాజా హ‌రి సింగ్ మ‌న‌సు మారి ఉండేదేమో కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డే పాకిస్థాన్ కొంప  మునిగింది.

అలాగ‌ని భార‌త్ కి వ‌రంగా ఏమీ మిగ‌ల్లేదు కాశ్మీర్. అదింకా ర‌క్త స్రావం చేస్తూనే ఉంది. ప్రాణ న‌ష్టానికి కార‌ణం అవుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు యుద్ధాలు జ‌ర‌గ్గా. వీటిలో 1971లో జ‌రిగిన యుద్ధ‌మొక్క‌టే కాశ్మీర్ కేంద్రంగా జ‌ర‌గ‌లేదు. అది తూర్పు పాకిస్థాన్ అలియాస్ బంగ్లాదేశ్ కోసం జ‌రిగింది. అది కూడా ఈస్ట్ వెస్ట్ పాకిస్తానీయులైన ముజ‌బుర్ రెహ‌మాన్, యాహ్యాఖాన్, భుట్టోల మ‌ధ్య సాగిన రాజ‌కీయ పోరు కార‌ణంగా జ‌ర‌గ్గా.. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ ఆవిర్భావ‌మైంది. ఈ ప్రాంతంలోని కోటి మంది బెంగాలీలు భార‌త్ వైపున‌కు బ‌లవంతంగా రావాల్సి వ‌చ్చింది. ఈ యుద్ధ స‌మ‌యంలోనే పాక్ జ‌లంత‌ర్గామి ఘాజీ విశాఖ తీరంలో అనుమానాస్ప‌దంగా మునిగింది.

మిగిలిన అన్ని యుద్ధాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు క‌శ్మీరే కీల‌కం. అస‌లు 1947- 48లో జ‌రిగిన తొలి ఇండో- పాక్ యుద్ధాన్ని తొలి కాశ్మీర్ వార్ గా పిలుస్తారు. త‌ర్వాత కార్గిల్ వ‌ర‌కూ జ‌రిగిన  యుద్ధాల్లో ఇరు ప‌క్షాల‌కు అపార‌మైన ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఒక్క కార్గిల్ వార్ లోనే పాక్ 4 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ ఆకాంక్ష‌తోనే పాక్ లో ఉగ్ర‌వాదం పురుడు పోసుకుంది. టూరిజం బ‌దులు టెర్ర‌రిజం పుట్టుకొచ్చింది. సౌత్ ఏషియా టెర్ర‌ర్ పోర్ట‌ల్ నివేదిక ప్రకారం ఒక్క పాకిస్తాన్ లోనే 80 నిషిద్ధ టెర్ర‌రిస్టు గ్రూపులుంటే వీటిలో 45 వ‌ర‌కూ ఉగ్ర ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. వీటిలోనూ ల‌ష్క‌రే తోయిబా, జైషే మొహ‌మ్మ‌ద్  భార‌త్ అంటేనే ర‌గిలిపోతాయి. ఈ ఉగ్ర సంస్థ‌లు భార‌త్ పై చేసే యుద్ధ‌మంటే.. దేశం కోసం చేసే యుద్ధంగా భావిస్తాయి. అందుకే వీరి  స‌హాయ స‌హ‌కారాల‌ను ఒక ప‌విత్ర కార్యంగా భావిస్తుంది పాక్ ఆర్మీ. ర‌వూఫ్ లాంటి టెర్ర‌రిస్టులు మ‌ర‌ణిస్తే.. వారికి త‌మ జాతీయ జెండాల‌ను క‌ప్పి మ‌రీ అంత్య‌క్రియ‌ల‌ను లాంఛ‌నంగా నిర్వ‌హిస్తుంది.

ఎప్పుడైతే  కాశ్మీర్ టూరిజం కోల్పోయిందో పాకిస్థాన్.. ఈ అంశం ద్వారా ల‌బ్ధి పొందాల్సింది కాస్తా.. టెర్ర‌రిజం అనే దానికి కేంద్ర స్థానంగా నిలిచింది. దీంతో ప్ర‌పంచానికి టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింది. ర‌ష్యాతో యురోపియ‌న్ దేశాల పోరులో యురోపియ‌న్ల వైపు నిలిచి.. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా త‌న టెర్ర‌రిస్టు కార్య‌క‌లాపాల‌ను అరువుగా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇదే యురోపియ‌న్ దేశాలు పాక్ అంటేనే మండి ప‌డుతున్నాయ్. లాడెన్ అయితే ఈ కక్ష కొద్దీ.. అమెరికాపై దాడులు నిర్వ‌హించి.. త‌ద్వారా అమెరికా త‌దిత‌ర దేశాల‌కు బ‌ద్ధ శ‌తృవుగా మారాడు. యూఎస్ ఆర్మీ పాకిస్తాన్  అబోతాబాద్ లో ఆశ్ర‌యం పొందుతున్న అత‌డ్ని మ‌ట్టుబ‌ట్టి త‌మ క‌డుపుమంట చ‌ల్లార్చుకుంది.

ప్ర‌స్తుతం ఈ దేశ టెర్ర‌రిజానికి రెండు క‌ళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్.. కాగా.. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన అకృత్యాల కార‌ణంగా భార‌త్ కి కొన్ని వంద‌ల సంఖ్య‌లో ప్రాణ‌హాని జ‌రిగింది. మ‌న పార్ల‌మెంటు దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, తాజాగా జ‌రిగిన ప‌హల్గాం దాడి.. అన్నిటికీ వీరే బాధ్యులు. ఈ ఇద్ద‌ర్ని భార‌త్ కు అప్ప‌గించాల్సిందిగా పాక్ ను డిమాండ్  చేస్తోంది భార‌త్. అప్పుడే ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ని ఆపుతామ‌న్న అల్టిమేటం జారీ చేస్తోంది.

అయితే మ‌సూద్ అజ‌ర్ త‌న త‌మ్ముడు, అక్క‌తో స‌హా దాదాపు త‌న కుటుంబాన్ని కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. హ‌ఫీజ్ స‌యీద్ సైతం త‌న  కొడుకు త‌ల్హాను ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో కోల్పోయాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌ఫీజ్ సైతం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చ‌న్న రిపోర్టులు అందుతున్నాయి. మ‌రి చూడాలి.. ఈ యుద్ధం ముగిసేనాటికి పాక్ కి ఏం మిగులుతుందో. భార‌త్ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో తేలాల్సి ఉంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అనేక యుద్ధాలు, సంఘ‌ర్ష‌ణ‌ల్లో పాక్ ది ఘోర ప‌రాజాయ‌ల ప‌రంప‌రే సాగుతోంది. ప్ర‌స్తుతం కూడా ఆ దేశ పార్ల‌మెంటులో ఒక ఎంపీ ఇదే అంశాన్ని నిల‌దీశాడు. పాక్ ప్ర‌ధాని ఓ పిరికిపంద‌గా అభివ‌ర్ణించాడు. అంతే కాదు ఆ దేశ సైన్యాధ్య‌క్షుడు మునీర్ అసీం అల్లాపై భారం వేశాడు. నో ప్లాన్స్.. ఓన్లీ ప్రేయ‌ర్స్ అంటూ చేతులెత్తేశాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ అనుచ‌రులైతే.. మీకంత ద‌మ్ము లేదు కానీ మా ఇమ్రాన్ని విడుద‌ల చేసి పాక్ ని కాపాడండీ అంటూ నినాదాలు జారీ చేస్తున్నారు.

ఇటు చూస్తే బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ అయితే పాక్ ని ఇదే అదునుగా చావు దెబ్బ తీయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే క్వెట్టాతో స‌హా మూడింట రెండొంతులు తాము స్వాధీన  ప‌రుచుకున్నామ‌ని అంటోంది. ఈ క్ర‌మంలో అంత‌ర్యుద్ధం సైతం పాక్ ఫేస్ చేస్తోంది. ప్ర‌జ‌ల్లో కూడా ప్ర‌భుత్వం, సైన్యం మ‌ధ్య తీవ్ర నిరాశా నిస్పృహ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ర‌క్ష‌ణ మంత్రి ని పార్ల‌మెంటు ప్ర‌శ్నించ‌గా.. వ్యూహాత్మ‌కంగానే తాము భార‌త దాడులు తిప్పి కొట్ట‌డం లేద‌న్న డొల్ల స‌మాధానాలు చెబుతున్నాడు. ఇక  ఆర్ధికంగా మాకు సాయం చేయండంటూ చందాలు కోరుతూ.. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టి మ‌రింత అభాసు పాలైంది.. పాకిస్థాన్. ఇలా ఎవ‌రైనా దేబిరిస్తారా? అని నిల‌దీస్తే.. త‌మ అఫిషియ‌ల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయిస్తోంది.

ఇలా ఏ కోణంలో చూసినా కూడా పాకిస్థాన్ ప్ర‌స్తుతం స‌జావుగా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ మందుగుండు సామాగ్రి కొర‌త‌తో కొట్టుమిట్టాడుతోంది. ఒక ప‌క్క చూస్తే మ‌న  ఐఎన్ఎస్ విక్రాంత్ క‌రాచీ పోర్టును ధ్వంసం  చేసింది. కేవ‌లం ట‌ర్కీ ఇచ్చిన డ్రోన్ షూట‌ర్ల సాయంతో భార‌త్ ను ఇరుకున  పెట్టాల‌న్న కోణంలో తీవ్ర య‌త్నాలు చేస్తోంది పాక్. వాటిని కూడా మ‌న ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ ధ్వంసం  చేస్తున్నాయ్. చైనా స‌హ‌కార‌మూ అంతంత మాత్ర‌మే. అవి ఇచ్చిన ఆయుధాలు ఎంత మాత్రం ప‌ని చేయ‌డం లేదు. పైపెచ్చు పేల్చిన చోటే పేలిపోతున్నాయ్...

ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్ర‌స్తుత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రం. ఇక మిగిలింది  అణుబాంబు. నేష‌న‌ల్ ఫుడ్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ ప్ర‌కారం ఈ రెండు దేశాల మ‌ధ్య అణుయుద్ధం వ‌స్తే జ‌రిగే  ప్రాణ న‌ష్టం 2 బిలియ‌న్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే  200 కోట్ల మేర ప్రాణ న‌ష్టం సంభ‌విస్తుందని అర్ధం.

ఇలా భార‌త్ పాక్ మ‌ధ్య గొడ‌వ టూరిజం  నుంచి మొద‌లై టెర్ర‌రిజం వ‌ర‌కూ వ‌చ్చి.. ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ సిందూర్ క్లైమాక్స్ ఏంటో అర్ధంకాని ప‌రిస్థితి వ‌ర‌కూ వ‌చ్చింది. త‌ర్వాత ఏం  జ‌రుగుతుందో ఆ దేవుడికే  ఎరుక‌!!!

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి ట్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.