పాకిస్తాన్ను దడ పుట్టిస్తున్న బలూచిస్తాన్
posted on May 12, 2025 @ 5:52PM
పాకిస్తాన్ను గత కొన్ని రోజులుగా నిద్రపట్టినివ్వకుండా చేస్తున్న చిన్న దేశం అది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ.. తన పోరాటం మాత్రం వీడటం లేదు. బలూచిస్తాన్.. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్ కు దడ పుడుతోంది. నిద్రలో ఉన్నా ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బీఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్లో పాక్ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్ కు ముచ్చెమటలు పిట్టించింది. పాక్ పై సమరానికి ఇదే సరైన సమయం అని భావించిన బీఎల్ఏ.. తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు.
బీఎల్ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్ను ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్టు బీఎల్ఏ అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ పాక్ మిలటరీ కాన్వాయ్పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్పైనా ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడులను తిప్పి కొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బీఎల్ఏ దాడులు చేస్తూ, ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి.. ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే, బలూచిస్తాన్లోని 39 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు బీఎల్ఏ శనివారం ప్రకటించింది.
ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తెలిపారు.బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాగ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బీఎల్ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైలులో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతామని పాకిస్తాన్ ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్లో 33 మంది బీఎల్ఏ తిరుగుబాటుదారులతోపాటు 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారు.
పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44శాతం ఒక్క బలూచిస్తాన్లోనే ఉండటంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బీఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతోంది. తమ వనరులను దోచుకుంటూ, తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. అదికాస్తా తిరుగుబాటుగా మారి నేడు యుద్దంగా రూపాంతరం చెందింది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు.. అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ ను దెబ్బ తీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయింది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై అంతర్యుద్దం చేస్తూనే ఉన్నారు.