ఏప్రిల్ లో 45 ఏళ్లు దాటిన వారికి టీకా
posted on Mar 23, 2021 @ 4:24PM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 60 ఏండ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. 45 ఏండ్లు దాటిన వారందరికి టీకా ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ సిద్దమవుతోంది. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్ ఒకటి నుంచి టీకాలు అందించనున్నట్లు ప్రకటించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు పంపిణీ చేసింది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకాలు ఇస్తున్నారు. రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో..యువత, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తాజా ప్రకటన వెలువడింది.
‘45 లేక అంతకంటే ఎక్కువ వయస్సున్న ప్రతి ఒక్కరు టీకా వేయించుకునే నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్, నిపుణులు ఇచ్చిన సూచనలను అనుసరించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు. మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది. సోమవారం ఒక్కరోజే 32,53,095 మందికి టీకాలు అందించింది.