చరిత్రను తిరగరాసిన సిందూర విజయం!
posted on May 8, 2025 @ 9:47AM
ఆపరేషన్ సిందూర్ కొద్ది నిముషాల వ్యధిలో విజయవంతంగా పూర్తయిన సైనిక చర్య. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన అద్వితీయ, అత్యద్భుత సైనిక చర్య. కేవలం 25 నిముషాల వ్యవధిలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించడాన్ని దేశమే కాదు, ప్రపంచం మొత్తం హర్షిస్తోంది. ఎక్కడా, వీసమెత్తు అపశ్రుతి లేకుండా.. భారత సైన్యం, సంపూర్ణం చేసిన ఆపరేషన్ సిందూర్ చరిత్రలో సిందూరం శక్తికి, పవిత్రకు ప్రతీకగా నిలిచి పోతుంది.
నిజానికి ఈ ఆపరేషన్ మొత్తం ఒకెత్తు అయితే, ఈ పవిత్ర ప్రతీకార చర్యకు పెట్టిన ఆపరేషన్ సిందూర్ పేరు ఒక్కటీ ఒకెత్తుగా పేర్కొంటున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడి గుండెను తట్టి లేపిందని అంటున్నారు పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు 26 మంది మాతృ మూర్తుల నుదుటి సిందూరాన్నిచెరిపేసిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన ఆపరేషన్ సిందూర్ పేరు భారతీయుల గుండెలను తట్టి లేపడమే కాదు, పాకిస్థాన్ కు బలమైన సందేశాన్ని కూడా పంపింది. నిజానికి ప్రతీకార చర్యకు ఇలాంటి పేరు పెడతారని ఎవరూ ఉహించి ఉండక పోవచ్చును. అయితే, మంగవారం (మే 6) రాత్రంతా సైనిక దాడులను పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సిందూర్ పేరును సూచించారని, అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఏప్రిల్ 22 న పహల్గాం లోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్ర వాదులు 26 మంది పురుషులను అత్యంత దుర్మార్గంగా హత మార్చారు. పుణ్య స్త్రీల నుదుటి సిందూరాన్ని కర్కశ మూకలు చెరిపేశాయి. ఉగ్ర పాపానికి మించిన మహా పాతకానికి, ఘోర తప్పిదానికి ఉగ్రమూకలు పాల్పడ్డాయి. హిందూ సప్రదాయంలో వివాహిత మహిళలు నుదుటన ధరించే సిందూరానికి ఉన్న విలువేమిటో ముష్కర మూకలకు తెలియక పోవచ్చును కానీ.. భారతీయులకు తెలియంది కాదు. ఆ సిందూరాన్ని దూరం చేసిన మహా పాతకానికి పాల్పడిన ముష్కర మూకలను భారత దేశం ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టదనే సందేశం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకే కాదు, పాక్ పాలకులకు చేరాలని ప్రధాని మోదీ అధికారాలకు స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రధాని మోదీ ప్రతీకార ఆపరేషన్ విషయంలో సైన్యానికి సంపూర్ణ స్వేచ్చను ఇచ్చినట్లు చెపుతున్నారు.ఇప్పడు విజయవంతమైనఆపరేషన్ కు ప్రధాని మోదీనే నామకరణం చేశారు. ఇప్పడు ఆపేరే ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతి ధ్వనిస్తోంది. మహిళల్లో విశ్వాసాన్ని నిపింది. భారతీయ సమాజానికి స్పూర్తిగా నిపిచింది. భారతీయ విలువలకు. భారతీయ మహిళల శక్తికి ప్రతీకగా నిలిచింది. ఒక విధంగా స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం నినాదం ఎలాగైతే భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతను తట్టిలేపిందో.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతా స్పూర్తిని మరోమారు తట్టి లేపింది.
ఇక్కడ ఇంకొక్క విషయం కూడా చెప్పుకోవాలి.. భారతీయ హైందవ సంప్రదాయంలో వివాహిత మహిళల నుదుటి సిందూరం ఒక అలంకారం కాదు మహిళా శక్తికి ప్రతి రూపం. అనే విషయాన్ని కూడా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియచేసిందని అంటున్నారు. అవును. ఇంతవరకు భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, యుద్ధంతో సమానమైన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. పరస్పర దాడులు జరిగాయి కానీ, ఏ సందర్భంలోనూ మహిళలు ముందుండి సైనిక చర్యను నడిపించింది లేదు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ పేరిట జరిగిన సైనిక చర్యను ఇద్దరు మహిళలు.. కల్నల్ సోఫియా, కంమాండర్ వోమిక ముందుండి నడిపించారు. అంతే కాదు, ఆ ఇద్దరే, సైనిక చర్య వివరాలను మీడియాకు వివరించారు. అందుకే ఆపరేషన్ సిందూర్ కేవలం మరో ప్రతీకార సైనిక చర్య కాదు.. సిందూరశక్తిని, సిందూర పవిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన సిందూర విజయం.