NTV-Nielsen-ORG Marg Surveys Proved 100% Accurate
posted on May 21, 2011 @ 9:59AM
ఎన్టీవీ సర్వే... 100% పర్ఫెక్ట్!
కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచిన ప్రజాభిప్రాయ సేకరణలు
ప్రతిక్షణం ప్రజాహితమనే నినాదంలో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీవీ... ప్రత్యక్ష ప్రసారాల్లోనే కాదు.. ప్రజాభిప్రాయానికి వేదికైంది. సర్వే అంటే ఏదో ఉజ్జాయింపుగా ఉంటాయనో.. వాస్తవానికి బారెడు దూరంలో సాగుతాయనే భ్రమల్ని పటాపంచలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, పోల్ సర్వేలకు పేరుగాంచిన నీల్సన్ ఓఆర్ జీ తో కలిసి ఎన్టీవీ ఇప్పటివరకూ చేసిన సర్వేలన్నీ అక్షరమక్షరం పొల్లు పోకుండా దాదాపు నూటికి నూరు శాతం నిజమవుతూనే ఉన్నాయని ఆ చానల్ ఓ ప్రకటనలో తెలిపింది.
2007 నీల్సన్ తో కలిసి తొలిసారిగా చేసిన సర్వే నుంచి తాజా కడప గడపలో జగన్ కు ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశంపై నిర్వహించిన సర్వే వరకూ అన్నీ అక్షర సత్యాలుగా నిరూపితమవుతూనే ఉన్నాయని గుర్తు చేసింది. ‘ఎన్నికల సమయంలోనే కాక సమకాలీన అంశాలపై పీరియాడికల్ గా సర్వేలు నిర్వహించాం. సర్వేల ఫలితాలు వెల్లడైన ప్రతిసారీ ఎన్నో విమర్శలు.. ఏకపక్షంగా రాశామంటూ.. ఎవరికోసమో సర్వేలు చేశామంటూ మాటలు విసిరారు. ఫలితాలు వచ్చిన ప్రతిసారీ ఎన్టీవీ సర్వేలే నిజమయ్యాయి. మాపై నోళ్లు పారేసుకున్న వాళ్లకు సర్వే ఫలితాలే సమాధానం చెప్పాయి’ అని తెలిపింది.
2007 – 2011...
2007 నవంబర్:
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును అంచనా వేసి, జనాభిప్రాయాన్ని ఆవిష్కరించేందుకు చేసిన తొలి సర్వే ఇదీ. డీలిమిటేషన్ కన్నా ముందు జరిపిన సర్వే కాంగ్రెస్ కు 141 – 152 సీట్లు, టీడీపీకి 116 – 126, టీఆర్ఎస్ కు 9 – 12, వామ పక్షాలకు 6 – 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇది మామూలు సర్వేనని అందరూ అనుకున్నారు. కాని 2008 లో ఎన్టీవీ ప్రీ పోల్ సర్వే అక్షరాలా నిజమయ్యాక తెలిసింది. ఈ సర్వే కచ్చితత్వమెంతో.
2008:
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీ లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు తెరతీశారు. ఈ రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీవీ – నీల్సన్ సర్వే చేసింది. ఈ సర్వేలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి పట్టు ఉన్నట్లు వెల్లడైంది. ఇక ఉప ఎన్నికలకు ముందు కూడా సర్వే చేసి టీఆర్ఎస్ 9 స్థానాలకు మించి గెలవదని, టీడీపీ 3 స్థానాలు దక్కించుకుంటుందని వెల్లడించింది. తెలంగాణాలో టీడీపీకి పట్టు ఉందటమేంటన్నారు. ఫలితాల్లో టీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. టీడీపీ 4 స్థానాలు దక్కించుకుంది.
2008 జూన్, డిసెంబర్:
ఆగస్టులో రాష్ట్ర రాజకీయ యవనికపై చిరంజీవి పీఆర్పీ ఆవిర్భవించింది. మెగా ఎంట్రీ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న అంశంపై చిరు పార్టీ పెట్టకముందు జూన్ లో... పెట్టిన తర్వాత డిసెంబరులో ఎన్టీవీ సర్వే చేసింది. డిసెంబరులో పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై సర్వే నిర్వహించగా... కాంగ్రెస్ కు 160 – 175, టీడీపీకి 60 – 72, పీఆర్పీకి 40 – 50, టీఆర్ఎస్ కు 10 – 15, లెప్ట్ కు 4 – 6, ఇతరులకు 10 స్థానాలు రావచ్చని తేలింది. భవిష్యత్ రాజకీయ చిత్రంపై ఓ స్పష్టతను ఈ సర్వే ఇచ్చింది.
2009 ఫిబ్రవరి
రాష్ట్ర ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన సర్వే ఇదీ. కాంగ్రెస్ కు 155 – 169, మహాకూటమికి 92 – 110, పీఆర్పీకి 30 – 35 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సర్వే తప్పన్నారు. ఎన్నికల ఫలితాలొచ్చాక అర్థమైంది. అక్షరం పోల్లుపోలేదు. కాంగ్రెస్ కు 156 సీట్లు రాగా.. టీడీపీ 92 సీట్లు దక్కించుకుంది. పీఆర్పీ 18 సీట్లతో సరిపుచ్చుకుంది.
2010 జూన్
కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. వై.ఎస్ మరణం లాంటి పరిణామాలు సంభవించాక.. రోశయ్య సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎన్టీవీ సర్వే నిర్వహించింది. రాజీనామాలతో తాడోపేడో అంటూ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అయింది. ఉప ఎన్నికల్లో గులాబీ దళం క్లీన్ స్వీప్ ఖాయమని సర్వే తేల్చగా.. అదే అక్షర సత్యమైంది.
2011 జనవరి:
వై ఎస్సార్ మరణం తర్వాత ఏ నాయకుడికి పాపులారిటీ ఉంది? 2014 ఎన్నికల్లో సిఎం గా ఎవరికి అవకాశం వస్తుంది? అన్న అంశంపై సర్వే నిర్వహించగా.. జగన్ కే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. 2014 తర్వాత ఆయనే సీఎం అవుతారని అత్యధికంగా 35 శాతం మంది అభిప్రాయపడ్డారు.
2011:
కడప జగన్ కు 66 శాతం ఓట్లు వస్తాయని ఎన్టీవీ – నీల్సన్ సర్వే తేల్సింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే సర్వే నిర్వహించారు. అదే నిజమైంది. జగన్ కు 67 శాతం ఓట్లు వచ్చాయి.
Courtesy: NTV