ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ప్రవేశానికి నోటిఫికేషన్ త్వరలో
posted on Aug 10, 2024 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
కాగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశం కోసం ఈ నెల 16 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు 1 నాటికి వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామనీ, అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రం మొత్తమ్మీద 35 మెడికల్ కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఎంబీబీఎస్ 'ఏ' కేటగిరీ కింద 3,856 సీట్లు కేటాయించామని వివరించారు. సీట్ల భర్తీ కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎ అటు రాష్ట్రవ్యాప్తంగా 1,540 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు.