బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు!
posted on Jan 17, 2023 8:53AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దానే కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటమౌతున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఈ ఏడాది 9 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తిరిగి ఆయననే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు , ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు దాదాపు ఖరారైందని చెబుతున్నారు. తన సొంత హిమాచల్ప్రదేశ్లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నడ్డానే కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని అంటున్నాయి.
నడ్డా హయాంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ, ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అలాగే సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో కూడా విఫలమైన నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఒక్క నడ్డానే కాకుండా ఏపీ, బిహార్, రాజస్థాన్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని జరిగిన ప్రచారం కూడా కూడా జరిగింది. ఏపీ, బిహార్, రాజస్థాన్కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కేరళ అధ్యక్షుడిపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయన మార్పూ ఖాయమని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులేవీ జరగకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ను మార్చాలన్న డిమాండ్, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చేరికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్ను నియమించి, సంజయ్ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కానీ, అధ్యక్షులను కానీ మార్చే అవకాశాలు లేవని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి .