నర్సుగా మారిన మేయర్ కిశోరీ పెడ్నేకర్!
posted on Apr 28, 2020 @ 11:50AM
కరోనా మహమ్మారి వికృతరూపం ప్రదర్శిస్తోంది. డెడ్లీ వైరస్ దెబ్బకు ప్రజలు ప్రత్యేకంగా, పరోక్షం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ప్రజలకు, కరోనా బాధితులకు అండగా వుండాల్సిన సమయంలో రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు తమ తమ నైజాన్ని బట్టి స్పందిస్తున్నారు. కొంత మంది నేతలు చిత్తకార్తె కుక్కల్లా పరస్పరం స్వప్రయోజనాల కోసం నిందించుకుంటుంటే మరి కొందరేమో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ అండగా నిలబడుతున్నారు.
ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ నర్సు డ్రెస్ వేసుకొని ఓ ఆసుపత్రిని సందర్శించారు. నాలుగు మంచి మాటలు మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఐక్యంగా ఉండి కరోనాపై పోరాడాలి' అని ఆమె పిలుపునిచ్చారు.
ముంబయి పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కరోనా వైరస్తో ముందు వరుసలో వుండి యుద్ధం చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నర్సింగ్ స్టాఫ్ను ప్రోత్సహించేందుకు అక్కడి మేయర్ కిశోరీ పెడ్నేకర్ నర్స్ దుస్తుల్లో బీవైఎల్ నాయర్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అక్కడి నర్సింగ్ సిబ్బందితో ఆస్పత్రి కలియదిరుగుతూ. వైరస్ను ఎదుర్కొనే క్రమంలో ఎదురవుతోన్న ఇబ్బందులపై అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో అందరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'నేను గతంలో నర్సుగా పని చేశాను. ఈ విధుల్లో ఉండే సవాళ్లపై అవగాహన ఉంది. నర్సింగ్ సిబ్బందికి నేనూ వారిలో ఒకరినే అన్న భావన కల్పించేందుకు ఇలా వచ్చానని కిశోరీ పెడ్నేకర్ తెలిపారు.
ఇదీ సేవ అంటే .. అంట్లు తోముతూ .. టాయిలెట్లు కడుగుతూ వీడియోలు పంపుతున్న మన సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు ఈమెని చూసి సిగ్గుపడాలి. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం దేశంలో మరెక్కడా లేనివిధంగా మన లీడర్లు కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతూ నీచాతి నీచమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం చేసుకోవడాన్ని చూసి తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో ఇంట్లో కూర్చోని నీచ రాజకీయాలకు పాల్పడకుండా కనీసం పదిమందికి సహాయం చేయాలనే తలంపుతూ పదిమందికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే బుద్ధి రాకపోతే జనం ఛీ కొడతారు.