ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు!
posted on May 15, 2024 @ 3:36PM
జూన్ 4న 'ముద్రగడ పద్మనాభరెడ్డి' నామకరణ మహోత్సవానికి భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముద్రగడ నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం అంటూ.. ఒక ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పిఠాపురంలో పవన్ ను కచ్చితంగా ఓడిస్తానంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళను తాను పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని.. తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి పవన్ పై గెలిచి తీరుతానని కూడా సవాల్ చేసిన సందర్భం ఉంది.
పోలింగ్ సరళి చూస్తే, పవన్ గెలుపు పక్కా అని తేలడంతో జనసైనికులు ముద్రగడ సవాళ్లను తెరపైకి తీసుకొచ్చారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవాలని, వినూత్న రీతిలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. 'ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ నమస్కారం.. ముద్రగడ నామకరణ మహోత్సవానికి రావాలని కాపు సోదర సోదరీమణులందరినీ ఆహ్వానిస్తున్నాం. జూన్ 4వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు. ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు వేశారు.
వాస్తవానికి ఒకానొక దశలో ముద్రగడ జనసేనలోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీలోకి వెళ్లిన ఆయన.. పవన్ పై నిత్య విమర్శకుడిగా మారిపోయారు. వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ సైతం చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలకు ముద్రగడ టార్గెట్ అయ్యారు. అటు సొంత కుటుంబ సభ్యులు సైతం ముద్రగడ వైఖరిని వ్యతిరేకించారు.
- ఎం.కె.ఫజల్