జగనన్న కరెంట్ కోత పథకం... పదో రత్నం అదుర్స్
posted on Oct 12, 2021 @ 4:15PM
ఆంధ్రప్రదేశ్ కు కరెంట్ గండం ముంచుకొస్తున్న వార్తలతో ఏపీ జనాలు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు ,మూడు రోజుల్లో కోతలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలే సంకేతం ఇవ్వడంతో.. కరెంట్ కష్టాలు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనధికారిక కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఏపీ కరెంట్ కష్టాలపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ భవిష్యత్లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని ఎంపీ రఘురామ రాజు చెప్పారు. విద్యుత్ సమస్య చాలా తీవ్రమైనదని.. దీనిపై సంబంధిత మంత్రి, అధికారులు మాట్లాడాలని.. కానీ సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటి..? అని ప్రశ్నించారు. జగనన్న ట్రూ చార్జ్తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందన్నారు. ఈ కొత్త పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందన్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు.