మౌనమేలనోయి.. మోడీది మౌనమా? వ్యూహమా?

గత మూడు వారాలుగా భారత్ పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధం జరుగుతోందా అన్నంతగా పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెల 22న కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదులు 26 మంది పౌరలను అత్యంత దారుణంగా, కృరంగా ఖతం చేశారు. ఈ సంఘటనను 2008 ముంబై దాడుల అనంతరం సాధారణ పౌరుల మీద జరిగిన అత్యంత దారుణమైన దాడి అనడంలో సందేహం లేదు.

ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ బీహార్ లోని ఒక సభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడికి వారి ఊహలకు అందనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నెల 7 భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా వంద మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. అప్పటి నుంచీ రెండు దేశాల మధ్యా యుద్ధం కొనసాగుతోందా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో భారత భూభాగంపైకి పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడితే.. పాక్ దాడులను భారత ఆర్మీ సమర్ధంగా తిప్పి కొట్టింది. పాక్ లోని నిర్దేశిల లక్ష్యాలపై భారత్ దాడులు చేసింది. ఈ తరుణంలో హఠాత్తుగా ఉరుములేని పిడుగులా శనివారం ( మే10) సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఘనతగా చెప్పుకుంటూ తన జబ్బలు తానే చరిచేసుకున్నారు.

భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కరెక్టే కానీ, ఇందులో మూడో దేశం ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కోరిక మేరకు మానవతా దృక్ఫథంతో తాము పాక్ వినతిని మన్నించామని చెప్పింది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి వెల్లడి కాగానే అప్పటి వరకూ మోడీ జపం చేస్తున్న యావత్ దేశం ఒక్కసారిగా ఆయనై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.  సరే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. దీనిపై మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి మిస్సైల్ తో బదులు చెప్పండని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే షెడ్యూల్ ప్రకారం సోమవారం (మే 12) ఇరు దేశాల సైన్యాధ్యక్షుల స్థాయి వర్చువల్ సమావేశంలో సంధికి స్పష్టమైన షరతులు విధించనున్నట్లు కూడా మోడీ మీడియా ముఖంగా ప్రకటించారు.  

అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించకపోవడం పట్ల పరిశీలకులు, రాజకీయనాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వారిలో భరోసా నింపాల్సి ఉండగా అందుకు భిన్నంగా మోడీ మౌనముద్ర వహించడం ఏమిటన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.  

Teluguone gnews banner