వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు లేవు
posted on Nov 10, 2018 @ 11:01AM
రేపు ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ముస్లిం మైనారిటీల నుంచి ఎన్.ఎం.డి.ఫరూక్, ఎస్టీ వర్గాల నుంచి కిడారి శ్రావణ్ కుమార్లకు చోటు కల్పిస్తున్నారు.అయితే ఎన్.ఎం.డి.ఫరూక్ కు మంత్రి పదవి కేటాయించడంపై తెదేపా నేతలు జలీల్ఖాన్, చాంద్బాషా స్పందించారు.మంత్రి పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.కేంద్రంతో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కుదరడం లేదని,పరిస్థితిని అర్థం చేసుకున్నామని తెలిపారు.
మంత్రి పదవిపై ఎమ్మెల్యే జలీల్ఖాన్ మాట్లాడుతూ..తాను సీనియర్నేనని.. మంత్రి పదవి ఆశించానని చెప్పారు. కొన్ని సమీకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదన్నారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చారని.. సర్దుకుపోయానని వివరించారు.ఎమ్మెల్యే చాంద్బాషా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మైనారిటీ కోటాలో గత విస్తరణలోనే తన పేరు చివరి నిమిషం వరకూ పరిశీలించారని.. కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగానే తనకు అవకాశం దక్కలేదన్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.