చంద్రబాబు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రతిష్ఘాత్మక అవార్డు వరించింది. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రదానం చేసే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఈ సారి చంద్రబాబుకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమలు చేస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు, అలాగే పెట్టుబడుల ఆకర్షణకు గానూ ఆయనకీ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ గురువారం (డిసెంబర్ 18) ప్రకటించింది.
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి 10.7 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ అవార్డుకు చంద్రబాబును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది.
ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ , నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవిస్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.