ఎన్నికల సంఘంపై హత్య కేసు?
posted on Apr 26, 2021 @ 2:25PM
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలోనే ఐదు రాష్ట్రాలో ఎన్నికలు జరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పార్టీలు కోవిడ్ రూల్స్ పాటించలేదు. వేలాది మంది సభలు, ర్యాలీలు నిర్వహించాయి. పార్టీల ముఖ్య నేతలు కనీసం మాస్కు ధరించకుండానే ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. దీంతో ఎన్నికల వలనే దేశంలో కరోనా వేగంగా విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
కరోనా సమయంలో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా మద్రాస్ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎన్నికల ర్యాలీల సమయాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంలో విఫలమై ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమైన భారత ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి సమమయంలో పొలిటికల్ ర్యాలీలను అనుమతిస్తున్నందుకు భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ఎన్నికల సంఘమే కారణమంటూ ఛీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘కోర్టులు పలుమార్లు ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా పొలిటికల్ ర్యాలీలు తీస్తున్న రాజకీయ పార్టీలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
కోర్టులు పలుమార్లు ఆదేశించినప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న విషయం చీఫ్ జస్టిస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరేమైనా వేరే గ్రహం మీద ఉన్నారా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు రోజు కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు చేసేందుకు తీసుకోబోయే చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్ను సమర్పించక పోతే మే2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను రద్దుచేస్తామని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.