స్థానిక సంస్థ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
posted on Jun 15, 2025 @ 12:35PM
ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తామని వివరించారు.క్యాబినెట్ సమావేశం ముగిశాక ఎన్నికల తేదీలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.
మరోవైపు.. ప్రభుత్వం గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను ఇప్పటికే తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్లు సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది