బీఆర్ఎస్ కు వామపక్షాలు దూరం.. కారణమదేనా?
posted on Feb 15, 2023 @ 4:48PM
బీఆర్ఎస్ కు మిత్రులు దూరమౌతున్నారా? ఇతర రాష్ట్రాలలో విస్తరణ పేరుతో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన నాయకులను చేర్చుకుని తన భుజాలను తానే చరుచుకుంటున్న కేసీఆర్.. తెలంగాణలో మాత్రం ఉన్న మిత్రులను దూరం చేసుకుంటోంది. గత ఎనిమిదేళ్లుగా అరమరికలు లేకుండా మిత్రపక్షంగా (ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు) ఉన్న ఎంఐఎం కారణాలేమైతేనేం ఇటీవలి కాలంలో దూరం జరుగుతూ వస్తోంది.
ఇక బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా.. బేషరతుగా కేసీఆర్ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తూ ముందుకు వచ్చిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) కు బేషరతు మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఆ పార్టీ అభ్యర్థి విజయానికి తమ వంతు సహకారం అందించాయి. అప్పుడే కాదు.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ.. వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచాయి. అందుకు వారు చెప్పిన మాట మతతత్వ శక్తులు బలోపేతం కాకుండా అడ్డుకోవడమేనని చెబుతూ వచ్చారు.
అంత వరకూ బానే ఉంది.. కానీ హఠాత్తుగా వామపక్షాలు ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగననున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలన్న వ్యూహంతో వామపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తో దోస్తీ ఉన్నప్పటికీ ఆయన వామపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీలకు లేకపోవడంతో వామపక్షాలు వ్యూహం మార్చాయి. బీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టి వామపక్షాలు ఉమ్మడిగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలన్న వ్యూహంతో ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ.. తెలంగాణలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే.. వామపక్షాల వ్యూహం బీఆర్ఎస్ విషయంలో మారిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అందుకు ఉదాహరణగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడాన్ని చూపుతున్నారు. వామపక్షాలకు ఎటూ సొంతంగా అధికారంలోకి వచ్చే బలం తెలంగాణలో లేదు. అయినా ఆ పార్టీ బీజేపీ వ్యతిరేకత విషయంలో ముందు వరుసలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కూడా గతంలో ఎలా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆయన మాట, శ్వాస కూడా బీజేపీ వ్యతిరేకతే అన్నట్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు కేసీఆర్ కు బేషరతుగా దగ్గరయ్యాయి. గతంలో వామపక్షాలను చులకన చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలూ, విమర్శలను సైతం పట్టించుకోకుండా మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ తరువాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సందడి చేశాయి. మరి హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ.. సొంతంగా పోటీపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు చేరువ అవుతున్న సంకేతాలు ఇచ్చాయి.
ఇందుకు కారణం.. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు వామపక్షాలతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు బలం లేని వామపక్షాలకు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం లేదనీ, కేసీఆర్ కూడా పోత్తు ఉన్నప్పటకీ వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా సానుకూలత చూపే అవకాశం లేదనీ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే వామపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని వ్యాఖ్యానించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కూడా వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీ.. అధికారం దక్కించుకున్నా దక్కించుకోలేకపోయినా.. రాష్ట్రంలో చెప్పుకోదగ్గంతగా బలపడిందన్నది మాత్రం నిర్వివాదాంశం. అలాగే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టడం, రాహుల్ భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ లో ఆత్మ విశ్వాసం పెరిగింది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో విజయంపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గణనీయంగా బలపడింది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఎర్పడు అవకాశాలున్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా బీఆర్ఎస్ కు దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువ కావడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఎలాగూ బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ కు సెక్యులర్ పార్టీగా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉంది. ఒక స్టేచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా ఎన్నికల తరువాత ఎటూ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దగ్గరవ్వక తప్పని పరిస్థితి ఉన్నందున ముందే కాంగ్రెస్ కు దగ్గరైతే గౌరవంగా ఉంటుందని వామపక్షాలు భావిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.