ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రేవంత్ సర్కార్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్  సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు.

దీనిపై అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదని నిలదీశారు. ప్రస్తుత డీజీపీ కూడా ఒకప్పుడు అధికారేనన్న కేటీఆర్ ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న విషయం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్న ఆయన  అలాగే నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏలా వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అడగరని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు వంటి డ్రామాలతో  ప్రజల దృష్టిని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నీ భక్తజనకోటితో కిక్కిరిసిపోయాయి. దేవాలయాలతో వైకుంఠ ద్వార దర్శనాలకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు.  తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అంటే  12గంటలు దాటిన తరువాత నుంచీ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించారు.  వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను  ఉత్తర ద్వార దర్శనం ద్వారాదర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు.  అలాగే చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన  ద్వారకా తిరుమలలో ఈ తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదున్నర నుంచి శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతించారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.   ఇక సింహాచలంలో  శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవదేవుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.  అదే విధంగా తెలంగాణలోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిట లాడు తున్నాయి.  రాష్ట్రంలోని   భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్  తొలి మహిళా ప్రధానని బేగం ఖలీదా జియా మంగళవారం డిసెంబర్ 30) కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. గత కొంత కాలంగా   అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బేగం ఖలీదా జియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.    కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించడంతో గత కొంత కాలంగా ఆమె ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు.   బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అజేయ శక్తిగా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రధానిగా మూడు సార్లు  బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు.  ఆమె మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.   ఖలీదా మరణించిన సమయంలో ఆమె కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్, కోడలు జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. బేగం ఖలీదా జియాకు ఇండయాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జన్మించినది ఇండియాలోనే.   1947లో దేశ విభజన  తర్వాత ఆమె కుటుంబం ప్రస్తుత బంగ్లాదేశ్ కు వలస వెళ్లింది.   1991లో బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.  మూడు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రధానిగా పనిచేసిన ఆమె ఆ దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. బేగం ఖలీదా జియా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ సహా, పలు దేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించుకోనుంది. రేణిగుంట విమానశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావులకేశవ్ స్వాగతం పలికారు.  సీఎం సతీమణి, అల్లుడు, కూతురు మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు.  గాయత్రి గెస్ట్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రులతో  కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్

  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను నవీన్ యాదవ్ వెల్లడించలేదని పేర్కొన్నాది. ప్రచారంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రి పరిశీలనలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ..‌ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్)కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ (మాగంటి సునీత) 74,259 ఓట్లు, బీజేపీ (దీపక్ రెడ్డి)కు 17,061 ఓట్లు వచ్చాయి.

రాయచోటిలో నిరసన జ్వాలలు...మూకుమ్మడి రాజీనామాలు

  అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడంపై రాయచోటిలో నిరసన జ్వాలలు రగిలాయి. ర్యాలీలతో పాటు పలువురు పదవులకు రాజీనామాలు చేశారు. మూడున్నరెఏళ్ళుగా జిల్లా కేంద్రంగా ఉండి పలు భవనాలకు స్థలాలు, నిధులు సమకూర్చుకొని ,జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పరిపారన సాగుతున్న తరుణంలో ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమే‌నన్నారు. రాయచోటిపై రాజకీయ కక్ష సాధించవద్దని కోరుతూ  కొందరు పదవులకు రాజీనామా చేస్తూ మాట్లాడారు.  జిల్లా కేంద్రాన్ని మార్పు చేయడం ద్వారా రాయచోటి వాసులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రజాధనం కూడా వృధా అవుతుందని, ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని మార్చకుండా  రాయచోటి లోనే కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. మహా ర్యాలీ రాయచోటి జిల్లా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ పట్టణంలోని శివాలయం చెక్ పోస్ట్ నుంచి నేతాజీ సర్కిల్, జామియా మసీదు సర్కిల్, గాంధీ బజార్, వైయస్సార్ సర్కిల్ ల మీదుగా బంగ్లా సర్కిల్ వరకు మహా ర్యాలీ చేశారు. మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. *రాజీనామాలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిరసనగా రాయచోటిలో మొదలైన రాజీనామాల పర్వం మొదలైంది. రాయచోటి పట్టణంలో 22వ వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు  పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి,  అయిదవ వార్డు కౌన్సిలర్ పోలంరెడ్డి విజయమ్మ లు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రం రాయచోటిని మార్పుకు నిరసనగా పలువురు కౌన్సిలర్లు రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వెనుకబడిన రాయచోటికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరొకసారి తమ నిర్ణయాన్ని పునరాలోచిన చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు.  

పిన్నమనేని సాయిబాబు మృతి టీడీపీకి తీరని లోటు : నందమూరి రామకృష్ణ

  సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ మాజీ  చైర్మన్‌  పిన్నమనేని సాయిబాబు  ఆకస్మిక మృతి పట్ల టీడీపీ నేత నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందడం అభిమానులు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సాయిబాబు మృతి యావత్ తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.  ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు పార్టీ కార్యకర్తలకు తీరని లోటుగా మారింది. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్ల నుంచే పసుపు జెండాను భుజాన మోసిన మొట్టమొదటి వీరసైన్య కార్యకర్తలలో సాయిబాబు ఒకరు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుండి పార్టీని నడిపించారు. ఒక నిబద్ధమైన అభిమానిగా, అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి. పిన్నమనేని సాయిబాబుకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, మా కుటుంబం తరఫున ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పసుపు కార్యకర్తలు, అభిమానుల హృదయాల్లో సాయిబాబు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయిని రామకృష్ణ తెలిపారు.  

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

  వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న  వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ  సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్‌ ఇంజినీర్‌, పలు విభాగాల అధికారులు టీటీడీ ఛైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ క్యూలైన్‌ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను వారు పరిశీలించారు.  వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్‌కు అధికారులు వివరించారు.  క్యూలైన్ ఎంట్రీ వద్ద భక్తులకు కల్పించి సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు

బిక్కి కృష్ణ రాసిన "సాయితత్వం - లీలారహస్యం" పుస్తకావిష్కరణ

  ప్రముఖ కవి, తత్వవేత్త బిక్కి కృష్ణ రాసిన"సాయితత్వం-లీలారహస్యం"అన్న గ్రంథాన్ని విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం. నరసింహప్ప హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. శ్రీ భం సాయి సేవాట్రస్ ఆధ్వంర్యంలో ప్రముఖ కవి డా. వి. డి. రాజగోపాల్  అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో కవయిత్రులు డా. రాధా కుసుమ,పద్మశ్రీలతలు పుస్తకాన్ని సమీక్షించారు. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశోధించి బిక్కి కృష్ణ సాధికారికంగా సాయితత్వం గ్రంథాన్ని రచించారన్నారు. ఈ సమావేశంలో యలవర్తి ధనలక్ష్మి,మారెళ్ళ రాజరాజేశ్వరి, కోగంటి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

మెస్సీని వెనక్కి నెట్టి రొనాల్డో అరుదైన రికార్డు

  ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్‌ నస్ర్‌ తరఫున అల్‌ అఖ్‌డౌద్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. రెండు గోల్స్‌ సాధించిన రొనాల్డో.. 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో 40 గోల్స్‌ పూర్తి చేశాడు. ఈ క్రమంలో లియోనెల్‌ మెస్సీని వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే 14 సార్లు ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌదీ ప్రో లీగ్‌లో  అల్‌ నస్ర్‌ 3-0తో విజయం సాధించింది. సౌదీ ప్రో లీగ్ చరిత్రలోనే వరుసగా పదో మ్యాచులు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్ నస్ర్ రికార్డు సృష్టించింది.  రొనాల్డో 31వ నిమిషంలో ఓ గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. చివరి నిమిషాల్లో జోవో ఫెలిక్స్‌ మరో గోల్‌ జోడించాడు. బాక్స్‌లో చురుకైన కదలికలతో రొనాల్డో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ ఏడాది రొనాల్డో క్లబ్‌ స్థాయిలో 32 గోల్స్‌, పోర్చుగల్‌ జాతీయ జట్టుకు 8 గోల్స్‌ చేశాడు. అదనంగా నాలుగు అసిస్టులు కూడా అందించాడు. మొత్తంగా ఇది అతని కెరీర్‌లో 14 సార్లు ఒకే ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ వేశాడు. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సిని అధిగమించాడు. మెస్సి ఈ ఘనతను 13 సార్లు మాత్రమే ఒకే సంవత్సరంలో 40 సార్లు గోల్స్ సాధించగలిగాడు. రొనాల్డో, మెస్సిల తర్వాత రాబర్ట్‌ లెవాండోవ్‌స్కీ (9 సార్లు), ఎంబాపే, హ్యారీ కేన్‌, హాలాండ్‌ (తలో 5 సార్లు) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. నాలుగు సార్లు (2011–14) ఏడాదిలో 60కిపైగా గోల్స్‌ చేసిన ఘనత కూడా రొనాల్డోదే.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైద్య  నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురాపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. పోచంపల్లి శ్రీధర్‌రావు (మాస్‌ కమ్యూనికేషన్‌)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.  రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగనున్నారు.   డాక్టర్ మంతెన సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి.