ఫ్లవర్ ని కాదు.. ఫైర్ ని అంటున్న కొండా మురళి
posted on Jun 29, 2025 7:52AM
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై గట్టి పట్టు ఉన్న నాయకుడైన కొండా మురళి ఇటీవల వచ్చే ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్లు, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఆపార్టీని భ్రష్ఠుపట్టించి.. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరై వారిని కూడా తప్పుదోవ పట్టించి నాశనం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండా మురళి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. సొంత పార్టీ నాయకులపైనే బహిరంగంగా విమర్శలు చేయడం,వరంగల్ లో తాను ఉన్నంత కాలం మరో లీడర్ రాడంటూ ప్రకటించడం, పరకాలనియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏకపక్షంగా ప్రకటించడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కొండా మురళి వ్యాఖ్యలను ఖండించారు. ఈ భేటీలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, సారయ్య, గుండు సుధారాణి, నాయిని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదలా ఉంటే తాజాగా కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట శనివారం (జూన్ 28) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారీగా మద్దతు దారులతో గాంధీభన్ కు ర్యాలీగా వచ్చారు. క్రమశక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యాంమోహన్, రామకృష్ణ, కమలాకరరావులతో దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్నపరిణామాలపై క్రమశిక్షణ సంఘానికి లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే తన వ్యాఖ్యలు, తనపై ఆరోపణలపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది.
క్రమశిక్షణ కమిటీ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మురళి తనను రెచ్చగొట్టదంటూ పరోక్షంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాను పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చాననీ, మరి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా? చేయరా? ఆయనే తేల్చుకోవాలన్నారు. తాను దేనికీ భయపడనన్న మురళీ.. అవసరం వచ్చినప్పుుడు అన్ని విషయాలూ చెబుతానన్నారు. మురళి వ్యాఖ్యలపై వివరణ కోరడానికి పిలిచిన క్రమశిక్షణ కమిటీ ఆయనను ఏం ప్రశ్నించిందన్నది పక్కన పెడితే మురళి మాత్రం కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపై కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్లో ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై వేదికలాంటి లేఖను క్రమశిక్షన కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. క్రమశిక్షణ కమిటీలో తనను అసలు ప్రశ్నించలేదన్న మురళి..తానే అయితే తానే తనపై ఆరోపణలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చానన్నారు.