మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం.. ఫలించిన కేశినేని చిన్ని కృషి
posted on Aug 2, 2024 @ 5:51PM
జగన్ నిరంకుశ పాలనతో విసిగిపోయి, వారి విధానాలతో ఫ్యాక్టరీ నడపలేక మూసివేసిన అశోక్ లేలాండ్ సంస్థ కృష్ణజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లిలో తయారీ ప్లాంట్ ను పునః ప్రారంభించేందుకు సిద్దమవుతుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిన ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, 2024 జూలై 29న అశోక్ లేలాండ్ కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందూజ కి లేఖ రాశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైందనీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారనీ, ఆయన హయాంలో ఎపి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందనీ వివరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ఆ లేఖలో వివరించారు. మల్లేపల్లి ప్లాంట్ ప్రారంభిస్తే దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం దొరుకుతుందని వివరించారు. ఎంపి కేశినేని శివనాథ్ లేఖకు ఆ కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందూజ సానుకూలంగా స్పందించారు.
మల్లవల్లి ప్లాంట్ లో తమ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ తయారు చేయడం లక్ష్యమని తెలియజేశారు. ప్లాంట్ లో కార్యకలపాలు మొదలుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం అవుతుందన్నారు. ఈ విషయంలో సహకరించాలని ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. ఈ విషయం పై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ తో సంస్థ మేనేజ్మెంట్ టీమ్ కలుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్ను పునరుద్ధరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి గా వున్నట్లు తెలిపారు.