కేసీఆర్... ముక్తసరిగా...

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగాలు చేయడంలో నేర్పరి. ప్రసంగాలను సుదీర్ఘంగా చేయడం మాత్రమేకాదు.. తన ప్రసంగంలో చురకలు, చెణుకులు, విమర్శలు, జోకులు, పిట్టకథలను కలిపి జనరంజకంగా మాట్లాడ్డంలో ఆయనకి ఆయనే సాటి. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగే సమాయంలో ఆయన చేతికి మైకు అందిందంటే ఆయన మాటల ప్రవాహానికి ఆనకట్ట వుండేది కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అనేక సందర్భాలలో భారీ ప్రసంగాలు చేశారు. అయితే ఎవరైనా సూచించారో లేక ఆయనే అనుకున్నారోగానీ, ఆయన భారీ స్పీచ్‌లు ఇవ్వడం మానేశారు. ఈమధ్య అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ముక్తసరిగా రెండు ముక్కలు మాట్లాడేసి తన ప్రసంగాన్ని ముగిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు హాజరైన జనం ఇప్పుడు కేసీఆర్ భారీగా మాట్లాడతారని ఎదురుచూసి నిరాశకు గురవుతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన క్రైస్తవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ ప్రసంగం కోసం చెవులు రిక్కించి కూర్చున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ‘‘మాటలు అనవసరం చేతలు ముఖ్యం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని తన ప్రసంగాన్ని ముగించి అందరూ అవాక్కయిపోయేలా చేశారు. గతంలో కొత్త సంవత్సరం డైరీల విడుదల కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్ ఇప్పుడు డైరీల ఆవిష్కరణ లాంటి కార్యక్రమాలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. సరే, కేసీఆర్ ముక్తసరిగా మాట్లాడే విషయాన్ని అలా వుంచితే, ఇతరులను కూడా తన దగ్గర ఎక్కువగా మాట్లాడనివ్వట్లేదు. ఈమధ్య మెదక్‌లోని ప్రఖ్యాత చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చికి సంబంధించిన ఒకాయన కేసీఆర్ దగ్గరకి వచ్చి ‘‘ఈ మెదక్ చర్చి ప్రాముఖ్యత ఏంటంటే...’’ అని చెప్పడం మొదలుపెట్టగానే కేసీఆర్ అతన్ని కట్ చేశారట. ‘‘నువ్వేం చెప్పక్కర్లేదు ఈ చర్చి హిస్టరీ మొత్తం నాకు తెలుసు. నేను చాలాసార్లు వచ్చాను’’ అన్నారట. మొత్తానికి ప్రసంగాల విషయంలో కేసీఆర్‌లో కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది.

Teluguone gnews banner