ఇల్లు అలకగానే పండగ కాదు

క‌డ‌పలో మ‌హానాడు తో జ‌గ‌న్ పై అన్నీ సాధించేసిన‌ట్టేనా?
ఆల్ హ్యాపీస్ అంటూ ఇంట్లో బ‌జ్జుంటే….
ప్రత్యర్థులకు ప్రాణం పోసినట్టే

బాబు భక్తులూ ఒకసారి వెనుదిరిగి చూడండి.. కూట‌మి ప్ర‌భుత్వం గెలిచిన కొత్త‌ల్లో ప్ర‌స్తుత స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఒక మాట అన్న విష‌యం గుర్తుందా?  జ‌గ‌న్ ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని.. నిజానికి ఇక్క‌డెవ‌రికీ జ‌గ‌న్ చావాల‌న్న‌ది కాన్సెప్ట్ కాదు. ఇవాళ జ‌గ‌న్.. అంత‌క‌న్నా ముందు వైయ‌స్ఆర్ ఆ త‌ర్వాత‌ కేసీఆర్ ఇలా.. వ‌రుస‌గా ప్ర‌త్య‌ర్ధులు మారుతుంటారు. రేపు మ‌రొక‌రు కూడా వ‌స్తూనే ఉంటారు.  ఏదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లా గెల‌వ‌డం అంటే ప్ర‌త్య‌ర్ధి మ‌ర‌ణం కాదు.. ఆ ఇజాన్ని చంప‌డం. విల‌నిజాన్ని అంతం చేయండం. ఈ విష‌యంలో మ‌న‌మెంత దూరం వ‌చ్చాం? నాలుగు పంచ్ డైలాగులు కొట్ట‌గానే స‌రిపోదు. జ‌గ‌న్ తాను అధికారంలోకి రాగానే ఎన్నో డైలాగులు కొట్టారు. సిద్ధం స‌భ‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. త‌ర్వాత ఏమైంది? మొత్తం తారు మారైంది. స‌రిగ్గా ఇక్క‌డే మ‌నం వ్యూహం ర‌చించాల్సి ఉంది. జ‌గ‌న్ కి వ‌చ్చింది ప‌ద‌కొండు సీట్లే కాబ‌ట్టి అత‌డి ఖేల్ ఖ‌తం అన్న భావ‌న‌లో ఉండ‌టం పూర్తిగా త‌ప్పు. ఆ సీట్ల వెన‌క 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు ఇదే జ‌గ‌న్ జ‌ర్మ‌నీలో ఉండి ఉంటే.. ప్ర‌తిప‌క్ష నేత అయ్యి ఉండేవాడు. అది కూడా అత్యంత లాంఛ‌నంగా.. ఘ‌నంగా!

నిజాలు మాట్లాడుకుందాం. జ‌గ‌న్ త‌ల్లీ చెల్లి వెళ్లిపోయారు. ఇక అత‌డు ఒంట‌రి. రేప‌టి రోజు జైలుకు కూడా పంపించేస్తాం. ఆయ‌న వెన‌క విజ‌యసాయిరెడ్డి కూడా లేడు. మోడీ నుంచి కోర్టుల వ‌ర‌కూ మొత్తం వ్య‌వ‌హారం న‌డ‌ప‌డానికి.. సాయిరెడ్డి సాయం కూడా కోల్పోయాడ‌ని అనుకూల మీడియాలు రాసే విషాద గాథ‌ల మాయ‌లో ప‌డిపోకండి(అది జ‌న్మ జ‌న్మ‌ల జైలానుబంధం)  లైట్ తీసుకోవ‌డం కూడా చేటు తెచ్చేదే.  ఎందుకంటే అది మ‌రో వ్యూహం కావ‌చ్చు. అటు నుంచి న‌రుక్కు రావ‌డం అన్న‌దొక‌టి ఇందులో దాగి ఉండొచ్చు.  ఏమో ఇప్ప‌టి దాకా మో,షాలు జ‌గ‌న్ని జైలుకు పంప‌కుండా ఉన్నారంటే అర్ధ‌మేంటి? షా ఇక్క‌డికి వ‌చ్చినపుడు జ‌గ‌న్ గురించి వాక‌బు చేసిన విష‌యం మ‌ర‌చి పోయారా?  ఆయనను అడ్డు పెట్టుకుని ఆటాడ్డానికి ఇంకా ఎన్నో ఛాన్సులుండొచ్చు.  ఎందుకంటే జ‌గ‌న్ ని  జైలుకు పంప‌డం అంటే అదేమంత‌ జోక్ కాదు.  లోకేష్ మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. మొత్తం మేనేజ్ చేశారు. ఇక జ‌గ‌న్ ప‌ని క్లోజ్ అనుకోడానికి అస్స‌లు వీల్లేదు. కార‌ణం ఏంటంటారా? ఇదే జ‌గ‌న్ తండ్రి వైయ‌స్ త‌న క‌థ ముగిసిపోయింద‌ని ఫీలైన‌పుడు అస‌లు క‌థ మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు ముందు మ‌న‌మిక ఏమీ సాధించ‌లేమయ్యా! అంటూ త‌న ఆత్మ కేవీపీతో  అన్న మాట‌ల‌ను మ‌ర‌చి పోయారా ఏంటి?

ఆ త‌ర్వాత చిన్నారెడ్డిని కెలికి.. తెలంగాణ అనే భూస్థాపిత‌మైన అంశాన్ని తిరిగి నిద్ర లేపి.. దాని ద్వారా  చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌నుకోవ‌డంతో పాటు.. 2004 ఎన్నిక‌ల్లోనూ గెలిచేశారు. ఆ టైంలో చంద్ర‌బాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌రిగింది కూడా. ఆ సానుభూతి ప‌ని చేయాలి.. కానీ అలా జ‌ర‌గ‌లేదు. పాద‌యాత్ర సైతం చేసి ఎలాగోలా వైయ‌స్ ఆనాడు అధికారంలోకి వ‌చ్చారో  చూశారుగా.  మరి జగన్… ప్ర‌త్యేక హోదా అనే డెడ్ లైన్  పాలి.. ట్రిక్స్ బ‌య‌ట‌కు లాగి.. దాని  ద్వారా.. ఏకంగా టీడీపీని ఎన్డీయేలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశారు. ఆ పై లోక్ స‌భ‌లో అవిశ్వాసం పెట్టి.. దానికి అధికార పార్టీ ద్వారా ఓటు వేయించిన ఘ‌నుడు జగన్. చ‌రిత్ర‌లో ఒక అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఓటు వేయ‌డం అదే తొలిసారి.

త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అంతా ముగిసిపోయింద‌ని జ‌గ‌న్ లాంటి నేత‌ను అంత తేలిగ్గా న‌మ్మ‌డానికి లేదు. ఎందుకంటే, ఆ బ్ల‌డ్ లోనే  తిరిగి కోలుకోవ‌డం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ప్ర‌తి బొట్టులోంచి పుట్టుకొచ్చే మ‌హిషాసురుడ్ని హ‌త‌మార్చిందేమోగానీ టీడీపీ దాని కూట‌మి పార్టీలు ఆ స్థాయిలో జ‌గ‌న్ రాజ‌కీయ ప‌త‌నాన్నేమీ శాసించ‌లేదు.  ఇంకా జ‌గ‌న్ త‌న టెక్నిక్స్ తాను వాడుతూనే ఉన్నారు. అందులో భాగంగా విజ‌య‌సాయిని తెలివిగా అటు వైపున‌కు పంపారు. చాలా మంది సాయిరెడ్డి కూడా లేరు అని ఓ ఫీలై పోతున్నారుగానీ.. ఆయ‌న నిజంగా ఆలాగే ఉన్నారా? ఒక లీడ‌ర్ పార్టీని వ‌దిలిన‌పుడు ఆయన హావ భావ విన్యాసాలు ఎలా ఉండేవి? 

చూడ‌లేదా మీరెప్పుడూ.. అదే విజ‌య‌సాయి తాను పార్టీని వ‌దిలిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ జగన్ పై అదే సాఫ్ట్ కార్న‌ర్ చూపుతున్నారు. గ‌మ‌నించారా?  సాయిరెడ్డి ఇంకా జ‌గ‌న్ కి సాయం చేసే మూడ్ క‌మ్ మోడ్ లోనే ఉన్నారు. అందుకే పార్టీ వ‌దిలి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న తిట్ల‌లో ఏమంత ఫ్ర‌స్టేష‌న్ లేదు. అంతా వ్యూహాత్మ‌కంగానే ఉంది. గమనించారా? ఒక్కోసారి ఆట‌గాడు.. జ‌ట్టులో ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గానూ వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు?  సాయిరెడ్డి సాయం అదృశ్య‌మైన‌ది కావ‌చ్చేమో.  2019లో విజ‌య‌సాయి ఆడియో కాల్ వ‌ల్లే ఆ పార్టీ గ‌ట్టెక్కింద‌ని గుర్తులేదా?  రేప‌టి రోజున బ‌య‌ట ఉండి ఇలాంటి సాయం చేయ‌రని ఎలా అనుకోగ‌లం.. ఎన్నో అవ‌కాశాలున్నాయ్.  ఇవాళ జ‌గ‌న్ తాను పార్టీ  న‌డ‌ప‌డానికి సైతం డ‌బ్బుల్లేవంటూ బీద‌రుపులు అర‌వ‌డం.. అద్దె కూడా క‌ట్ట‌లేనంటూ పార్టీ ఆఫీస్ మార్చేయ‌డం.. ఇలా చేస్తున్న‌దంతా నాట‌కం కాద‌ని ఎలా చెప్ప‌గ‌లం?  ఏమో ఏయే అవ‌స‌రాలు తీర్చ‌డానికి ఈ రాజ‌కీయాల్లో ఎవ‌రు- ఏ వైపునుంచి- ఎలా కాపు కాచి ఉన్నారో ఊహించ‌లేం కూడా ఒక్కోసారి.  

ఒక రోజుకు జ‌గ‌న్.. శాండ్- వైన్- మైన్ అంటూ రోజుకు వెయ్యి(1000) కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేశారని అంటారు ఆ కాంపౌండ్లో కొన్ని క‌ళ్లారా  చూసిన‌- గుంటూరు చార్టెడ్ అకౌంటెంట్లు. కేసిరెడ్డి ద్వారా జ‌గ‌న్ చేయించింది.. నాట్ ఓన్లీ మ‌ద్యం కుంభ‌కోణం... హ‌వాలా వ్య‌వ‌హారం కూడా.  కోటి పంపి ఎన‌భై ల‌క్ష‌లు తిరిగి వ‌చ్చేలా ఒక నెట్ వ‌ర్క్ న‌డిపారంటే.. ఊహించుకోవ‌చ్చు.. ఇది ఎంత పెద్ద స్కెచ్చో. రియ‌ల్ ఎస్టేట్, న‌గ‌ల దుకాణాలు, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఇలా అన్ని మార్గాల ద్వారా ఈ సొమ్ము ఎవ‌రికి చేరిందో తెలిసిందే. 

జ‌గ‌న్ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన‌గానే ఆనాడు అందుకున్న క‌ట్ట‌ల పాములు ఊరుకుంటాయా ఏంటి? వాటి తాలుకూ  క‌స్సు బుస్సులు అడ‌వుల‌ను కూడా కొనేసేంత భారీ  స్థాయిలో.. బ‌య‌ట ప‌డుతూనే ఉంటాయ్.  అందుకే బాబు క‌డ‌ప  మ‌హానాడులో అన్న‌ది.. ప‌హల్గాం ఉగ్ర‌వాదుల‌క‌న్నా ఈ ఆర్ధిక ఉగ్ర‌వాదులు మ‌హా డేంజ‌ర‌ని.

తల్లి సాయం లేదు, చెల్లి సాయం అంత‌క‌న్నా లేదు.. అనుకోడానికే వీల్లేదు. బావ అనిల్ కూడా స‌పోర్ట్ ఇవ్వ‌లేద‌ని జ‌స్ట్ లైట్ తీస్కోడానికి అంత‌క‌న్నా లేదు. ఆనాడు కేఏ పాల్ క్రిష్టియ‌న్ సంఘాల‌ను పోగేసి.. త‌ద్వారా అతి పెద్ద క్రైస్త‌వ శ‌క్తిగా ఎదుగుతున్నారని తెలిసి.. అనిల్ అనే ఒక బ్రాహ్మ‌ణ  క్రిష్టియ‌న్ని తెచ్చి.. త‌ద్వారా ఇక్క‌డ త‌న కుటుంబంలో అంటు క‌ట్టి.. ఇప్పుడా బావ‌ను అతి పెద్ద క్రిష్టిన్ గా ఎదిగాక‌.. ఆయనకు మాత్రం ఒక విజ‌య‌సాయికి ఉన్న‌ట్టు లోలోన ఓ కృత‌జ్ఞ‌తాభావం ఉండ‌క పోతుందా ఏంటి?

అయిపోయింద‌నుకున్న చోట నుంచి పుట్టేదేన‌మ్మా రాజ‌కీయం. ఇది వెయ్యి త‌ల‌ల రాకాసి. అందునా రాజారెడ్డి మ‌న‌వ‌డు కూడా. ఒక‌ప్పుడు త‌న‌దైన ఫాక్ష‌నిజంతో ఒక కాపు మైనింగ్ య‌జ‌మానికి ర‌క్ష‌ణ‌గా  నిలుస్తాన‌ని మాట ఇచ్చి.. ఆ త‌ర్వాత ఆ మైన్ కే ఓన‌రైనోడి మ‌న‌వ‌డు. ఇలాంటి జుజుబీలు ఎన్ని చూసుంటారు? ఏం క‌థ‌!

ఇప్పుడు జ‌గ‌న్ ని కానీ ఆయనలాంటి నాయ‌క‌త్వాన్ని కానీ ఈ భూమ్మీద లేకుండా చేయ‌డం ముఖ్యం కాదు. ఆయన చేసిన విధ్వంసం.. దాని తాలూకూ ప్ర‌భావం ఎలాంటిది? భ‌విష్య‌త్ లో దాని ద్వారా ఆంధ్రులు కోల్పోయేది ఏంట‌న్న‌ది మాత్ర‌మే మ‌నం ఫోక‌స్ చేయాలి. ఏమో పైకి కూట‌మి ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని? అడుగుతూనే లోలోప‌ల ఏ ప్ర‌త్యేక హోదాలాంటి  డెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నారో?  డెడ్ డెత్ అనే ప‌దాలు జగన్ కు క‌లిసి వ‌చ్చిన‌ట్టు మ‌రెవ‌రికీ క‌ల‌సి  రావు కూడా!

విలేఖ‌ర్ల‌తో తెలిసీ తెలియ‌క‌ ముచ్చట్లాడుతూ.. ఏ రెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నాడో ఏమో. ఎవ‌రికెరుక? కొన్ని సెటిల్మెంట్ లతో  అన్నీ వాటిక‌వే మాఫీ అయిపోవా??? ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌టున్నాడంటే విజ‌య‌సాయి ఉండ‌టం వ‌ల్లే కాదు.. ఇలాంటి విజ‌యాల‌ను, సాయాల‌ను వంద కొన‌గ‌ల‌డు.. (ఇందాకే అనుకున్నాంగా రోజుకు వెయ్యి కోట్ల‌ని) అలాంటోడ్ని త‌క్కువ అంచ‌నా వేసి... క‌డ‌ప‌లో జ‌రిపిన‌ మ‌హానాడుతో ఈ విజ‌యం సంపూర్ణం అనుకోడానికి అస్స‌లు వీల్లేదు.

చిన్న‌పామునైనా ప‌ద్ద క‌ర్ర‌తో కొట్టాలంటారు.. అలాంటిది ఇంకా న‌ల‌భై శాతం ఓట్ షేర్ అనే ప్రాణంతో ఉన్న పామిది.. న‌ల‌భై గురూ 40.. దాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు. దేవాన్ష్ తో ఢిల్లీ తాత‌య్య ఎందుకాడుకున్నాడో ఏమో.. ఒక్కోసారి  యురోపియ‌న్ సిగ్న‌ల్స్ వేరుగా ఉంటాయ్. మీకు అతి గౌర‌వం ఇస్తున్నారంటే ఎక్క‌డైనా ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వ‌డానికేనేమో.. ఎవ‌రికి తెలుసు???

కాబ‌ట్టి బాస్ మ‌నం చేయాల్సింది.. జ‌గ‌న్ని అంతం చేయ‌డం కాదు. జ‌నంలో ఉన్న అత‌డి న‌మ్మ‌కాన్ని. ఇంత‌కీ ఏంటా న‌మ్మ‌కం అంటే, ఆ ప‌ల్స్ ప‌ట్టుకోవాలి. దాని ద్వారా మొత్తం సెట్ చేయాలి. విజ‌య‌సాయి కూడా లేడు అని ఓ ఫీలై పోమాకండి. ఆయ‌న చుట్టూ ఉన్న లీడ‌ర్లంతా అయితే జైలు, లేదంటే బెయిలు, మ‌రీ మాట్లాడితే వ‌కీళ్ల‌ని వాడెవ‌డో రాసాడ‌ని రిలాక్స్ అయితే … ఇది రాజ‌కీయం. అందునా.. ఏం చేసైనా.. పై చేయి సాధించాల‌నుకునే రాజారెడ్డి మార్క్ రాజ్యాంగం. రెడ్ బుక్ ని చూసి వాళ్లంతా జ‌డుసుకుంటున్నార‌ని నీకు నువ్వ బిందాస్ అయిపోకు.. అన్న‌ది కొంద‌రు విశ్లేష‌కుల నుంచి కూట‌మినేత‌ల‌కు అందుతోన్న సూచ‌న‌. మ‌రి చూడాలి.. దీన్ని కూట‌మినేత‌లు ఎలా తీసుకుంటారో తేలాల్సి ఉంది.

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు : కేటీఆర్

  అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "స్వంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని మండిపడ్డారు. ఉప ఎన్నికల భయంతోనే వెనకడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు  అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మేరకు స్పీకర్  కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికంగా అడ్డుపెట్టుకుని గోడ దూకిన ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ సంబరపడినా, ప్రజాక్షేత్రంలో వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.

పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి వేగంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నాయకులు, జగన్ సన్నిహితులు కమలం గూటికి చేరారు. ఇలా ఉండగా ఎవరెలా వెళ్లిన కడప, మరీ ముఖ్యంగా పులివెందులలో వైసీపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఇంత వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే పులివెందుల జడ్డీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా నోచుకోకుండా ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పుడే పులివెందులలో వైసీపీది వాపేనా, బలం కాదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీయులు, నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం కూడా పులివెందులలో వైసీపీ బలం సన్నగిల్లిందనడానికి తార్కానంగా నిలిచింది. ఇక తాజాగా జగన్ సన్నిహితుడు,    వేంపల్లిలో వైసీపీ కీలక నేత అయిన చంద్రశేఖరెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి గుడ్ బై చెప్పి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లిలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు.  ఈ పరిణామంతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభమైనట్లేనని అంటున్నారు.  

ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు బుధవారం (డిసెంబర్ 17) కీలక తీర్పు వెలువరించారు.  ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పడానికి సాక్ష్యాధారాలు నమోదు కాలేదని పేర్కొంటూ అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మస్ చేశారు. బుధవారం ఆయన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు.  2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు. కాగా సుప్రీంకోర్టు ఈ నెల 17వలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై తీర్పు వెలువరించారు.  

కాంగ్రెస్, బీజేపీల్లో లీకు వీరులు.. హరీష్, కేటీఆర్ కు చేరుతున్న కీలక సమాచారం!

తెలంగాణ పారిశ్రామిక విధానంపై  రేవంత్ సర్కార్ ఇలా అనుకుందో లేదో.. అది విషయం అలా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ కి చేరిపోయింది. ఇవేం లీకులురా బాబూ అంటే రేవంత్ సర్కార్ ఒక్క‌సారి  ఉలిక్కి ప‌డింది.   ప్ర‌భుత్వ అధికార గ‌ణంలో.. మ‌రీ ముఖ్యంగా  స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా?  అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.   అలాగే  మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన కోవ‌ర్ట్ కామెంట్ కూడా బీఆర్ఎస్ కు పార్టీలో ఉన్న లీకు వీరుల సంగతిని ప్రస్ఫుటం చేసింది. ఇంతకీ మైనంపాటి ఏమన్నారంటే..   రాష్ట్రం సంగ‌తేమో తెలీదు కానీ, మెద‌క్, సిద్ధిపేట ప‌రిస‌ర‌ప్రాంతాల‌లో  హ‌రీష్ రావు ప్ర‌భావం చాలా చాలా ఎక్కువ‌గా ఉంద‌నీ,    ఒక మాట మన నోటి నుంచి ఇలా వచ్చిందో లేదో.. అలా హరీష్ కు చేరిపోతుందని బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు.   ప్ర‌భుత్వ అధికారుల్లోనూ హ‌రిష్ ఫాలోయ‌ర్స్,  మద్దతు దారులు బలంగా ఉన్నారన్న అభిప్రాయమూ కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.  దీనిపై కూడా మైనంప‌ల్లి  బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవ‌ర్ట్ నెట్ వ‌ర్క్ న‌డుపుతున్నా,  ఎప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లు, ఇత‌ర‌ ప్ర‌భుత్వ స‌మాచారం వారికి చేరిపోతున్నా..  ప్ర‌జ‌లు మాకు ప‌ట్టం క‌ట్టి  గెలిపిస్తున్నారన్నారు  మైనంప‌ల్లి.  అయితే ప్రభుత్వ సమాచారం ప్రతిపక్షానికి లీక్ కావడమన్నది ఎంత కాదనుకున్నా ఇబ్బందేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.  అయితే ఆ లీకులు ఒక్క రేవంత్ సర్కార్ కే పరిమితం కాలేదనీ, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీలోనూ ఉన్నాయనీ వెల్లడైంది. కమలం పార్టీలోనూ లీకు వీరులున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో తమ భేటీ లో ని అంశాలన్నీ లీకయ్యయని కిషన్ రెడ్డి లబోదిబో మన్నారు. ఇలా లీకులు చేసే వారు మెంటల్ గాళ్లంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా ప్రధాని  మోడీ.. సోష‌ల్ మీడియాలో మీక‌న్నా అస‌దుద్దీన్ ఓవైసీ  న‌యం అన్నారు. ఆ మాట బయటకు వచ్చేసింది. మోడీ అక్షింతలతో రాష్ట్ర బీజేపీ నేతల పరువు సగం పోయింది. మోడీ వ్యాఖ్యలు లీక్ అయ్యి బయటకు రావడం, ఆ లీకు వీరుల పని పడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చెప్పక తప్పని పరిస్థితి రావడంతో రాష్ట్ర బీజేపీ పరువు పూర్తిగా పోయినట్లైంది. మొత్తం మీద అధికారంలో లేకున్నా ట్యాపింగ్ వంటి  దారులలో స‌మాచార సేక‌ర‌ణ చేయ‌డానికి వీల్లేకున్నా కూడా హ‌రీష్, కేటీఆర్ కి చేరాల్సిన  స‌మాచార‌మైతే చేరిపోతోంద‌న‌డానికి  ఎటువంటి సందేహం అవసరం లేదు.   

హస్తినలో తెలంగాణ సీఎం.. కేంద్ర మంత్రులు, సోనియాతో భేటీలతో బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు.  వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.  వీటి నిర్మాణం,   ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.   అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా  హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాల‌ని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు.  ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు.  అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్  నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి.   ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో  సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే..  తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు.  ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో  రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.   

ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విజిలెన్స్ విచారణ

హైదరాబాద్ లోని ఐడీపీఎల్  భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల  కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత  ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా,  మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో  ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   ఈ విచారణలో  కబ్జాదారులు ఎవరన్నది తేలితే   వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు. 

అనుచిత పోస్టుల కేసు... జగన్ సమీప బంధువు అరెస్ట్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు  అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అప్పటి విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతిగా అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఈ అరెస్టు జరిగింది.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో  తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు. జగన్ గద్దె దిగి   రెండేళ్లు అవుతున్నా నాడు జగన్ అధికారం అండ చూసుకుని చెలరేగి అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించక తప్పడం లేదు.  జగన్ హయంలో ఇష్టారీతిగా వ్యవహరించి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు పలువురు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే విదేశాలకు పరారైపోయారు. అయితే పోలీసులు వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.   అధికారం శాశ్వతం, ఏపీలో ఇక తమకు ఎదురేలేదన్నట్లు అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయి,  జగన్ మెప్పు కోసం  సోషల్ మీడియాలో విపక్షాల ముఖ్యనేతలు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ   రాక్షస ఆనందం పొందిన వైసీపీయులు ఇప్పుడు  కేసులు ఎదుర్కొంటున్నారు.  ఎక్కడెక్కడికో పరారైన వైసీపీ నేతలను పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ అదుపులోనికి తీసుకుంటున్నారు.   తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది. అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్జున్‌రెడ్డిని అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అదుపులోనికి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశారు. అయితే అర్జున్‌రెడ్డి అప్పటికే తన లాయర్లను ఎయిర్‌పోర్టుకి రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి.  వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనుమడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ చార్జ్‌షీట్ వేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.  మరోవైపు బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని  కడప చిన్నచౌకు పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన టీడీపీ నేతలు గత ఏడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులురెడ్డిపై చిన్నచౌకుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా.. కూటమి అధికారంలోకి రాగానే బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్‌ వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  గల్ఫ్‌ నుంచి ఆయన హైదారబాద్‌కు రాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచ్చారు. మొత్తానికి అరెస్టుల భయంతో అసలే బిక్కుబిక్కు మంటున్న వైసీపీ శ్రేణులకు ఈ తాజా అరెస్టులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం : కవిత

  సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం  సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని...అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.  ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.  ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు.  సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.  కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు.  తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు. చిరంజీవి అభిమానిని.. కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా...చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని...చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు.  చిన్నప్పుడు ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్ గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.  ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ ఆస్క్ కవిత ఇంటరాక్షన్  గంటన్నర పాటు సాగింది. వందలాది మంది ట్విట్టర్ (ఎక్స్) లో ప్రశ్నలు అడిగారు .. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం  ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.