బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్?

 

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మళ్ళీ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా వున్న మాంఝీని జేడీయూ పార్టీ నుంచి బహిష్కరించారు. జేడీయు బీహార్ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ని పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే బీహార్ సీఎం మాత్రం ఎదురు తిరిగాడు. బీహార్ అసెంబ్లీని రద్దు చేసే విధంగా అడుగులు వేశాడు. అయితే ఏడుగురు మంత్రులు మాత్రమే ఆయనకు మద్దతు పలికారు. మిగతా మంత్రులు శాసనసభ రద్దుకు వ్యతిరేకతలను తెలియజేశారు. అయినప్పటికీ మాంఝీ గవర్నర్ని కలిసి శాసనసభను రద్దు చేయాల్సిందిగా కోరడానికి సిద్ధపడుతున్నాయి. అయితే అయన విజ్ఞప్తిని గవర్నర్ ఆమోదించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. జేడీయు మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నరేంద్రమోడీ మొన్నటి ఎన్నికలలో గెలవటంతో అప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పీఠం మీద దళితుడైన మాంఝీని కూర్చోబెట్టారు. అయితే అప్పటి నుంచి మాంఝీ కొరుకుడుపడని కొయ్యలా తయారయ్యాడు. వివాదాస్పద ప్రకటనలు చేస్తూ జేడీయుకి తలనొప్పిగా మారాడు. చివరికి పార్టీ నుంచి బహిష్కృతుడు అయ్యాడు. క్షణక్షణానికీ మారుతున్న బీహార్ రాజకీయాలు ఆదివారం నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది.

Teluguone gnews banner