Read more!

జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్, శకపురుషుడు సావనీర్.. చంద్రబాబుకు వివరించిన ఎన్టీఆర్ శతజయంతి కమిటీ

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో ఆదివారం(మార్చి 26)  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడితో ఆయన నివాసంలో బేటీ అయ్యింది. మహానటుడు, ప్రజానాయకుడు తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా జయహో ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్, శకపురుషుడు అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్.టి.ఆర్. శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని టీడీ జనార్ధన్ చంద్రబాబు నాయుడికి  వివరించారు. 

 శత జయంతి వేడుకలలో భాగంగా ఎన్.టి.ఆర్. ప్రసంగాలతో వెలువడే రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్,  శకపురుషుడు సావనీర్ ను హైదరాబాదులో  విడుల చేస్తామని తెలిపారు.  ఈ రెండింటికీ సంబంధించిన  విశేషాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  వివరించారు. 

గత ఐదు నెలలుగా ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీ శ్రమిస్తున్నదని,  సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకున్నామనీ,  ఎన్.టి.ఆర్.ను తరతరాలు గుర్తుంచుకునే దిశగా వీటిని రూపకల్పన చేస్తున్నామని   జనార్థన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు.  

ఎన్.టి. రామారావు  నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలారని అటువంటి నాయకుడిపై జనార్థన్ సారథ్యంలో కమిటీ చేస్తున్న కృష్టి అభినందనీయమని చంద్రబాబు అన్నారు.  ఈ కమిటీ చేస్తున్న అవిరళ కృషికి తమ మద్దతు ఉంటుందన్నారు.  హైదరాబాద్, విజయవాడ రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విజయవంతం కావటానికి కావలసిన సంపూర్ణ మద్దతు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టి.డి. జనార్థన్ అధ్యక్షతన రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కంఠంనేని రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు,  మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్, మధుసూదన రాజు, విజయ్ భాస్కర్, గౌతమ్ బొప్పన కమిటీ సభ్యులు చంద్రబాబునాయుడిని కలిసిన వారిలో ఉన్నారు.