జనసేన నాయకుడిపై దాడి.. కృష్ణా జిల్లాలో టెన్షన్ టెన్షన్
posted on Sep 25, 2021 9:17AM
ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై దాడులకు అంతే లేకుండా పోతోంది. తాజాగా కృష్ణాజిల్లా పెడనలో జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును దుండగులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న హోటల్లో రాత్రి రామ్ సుధీర్ బస చేశారు. అయితే బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు ఆగంతకులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య అవగాహన కుదిరింది. దీంతో ఆచంట, వీరవాసరం MPPలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. చంటలో MPPని తెలుగుదేశం గెల్చుకుంది. ఇక్కడ టీడీపీ-7, జనసేన- 4, వైసీపీ 6 చోట్ల విజయం సాధించాయి. జనసేన మద్దతుతో MPP టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జనసేనకు వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులు దక్కాయి. వీరవాసరంలో ఆసక్తికర రాజకీయం జరిగింది. అతి తక్కువ సీట్లు గెలిచిన TDPకి MPP దక్కింది. ఇక్కడ జనసేన-8, టీడీపీ-4 చోట్ల గెలుపొందాయి. వైసీపీ 7 చోట్ల విజయం సాధించింది. అయితే ఇక్కడ కూడా జనసేన మద్దతుతో టీడీపీకి చెందిన వీరవల్లి దుర్గాభవాని పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.