అక్కడ ఆలింగనాలు.. ఇక్కడ దాడులు.. జగన్ ద్వంద్వ ప్రమాణాలు
posted on Apr 2, 2023 @ 4:48PM
అమరావతే రాజధాని. అందుకే కేంద్రం అభివృద్ధికి నిధులు ఇచ్చింది. అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నట్లు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు అమరావతి రైతులకు మద్దతు ఇస్తే దాదులు చేస్తారా?' అంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మద్దతు తెలిపి వస్తున్న తమ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి పథకం ప్రకారమే జరిగిందన్నారు.
ఇది ప్రభుత్వ పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినందున పాల్పడిన వారిపై హత్యాయత్నం, దాడి, కుట్ర కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బీజేపీ సహించబోదన్నారు. అక్కడ పోటీ ఉద్యమం నిర్వహించడం రెచ్చగొట్టే చర్యలో భాగమేనని వీర్రాజు మండిపడ్డారు. జరిగిన ఘటనపై జాతీయ నాయకత్వానికి నివేదిక పంపామని, ఆ నివేదికలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది కూడా వివరించామని ఆయన తెలిపారు. అమరావతే రాజధాని అన్నదే బీజేపీ ఏకైక నినాదమని, అందుకే రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీ, అమిత్ షాలను అలింగనం చేసుకుంటూ.. వారికి ఫ్లవర్ బొకేలు, దేవతా విగ్రహాలు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చీ రావడంతోనే.. బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడటమేమిటని అటు బీజేపీ శ్రేణులు..ఇటు జనం ఆశ్చర్యపోతున్నారు..జగన్ ద్వంద్వ ప్రమాణాలపై షాక్ కు గురవుతున్నారు. జగన్ తీరుపై కేంద్రం రియాక్షన్ ఏమిటని జనం ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు..