జగన్ కేబినెట్ నుంచి 18 మంది అవుట్? కొత్తగా చోటు దక్కేది వీరికేనా?

సమయం దగ్గర పడుతోంది. పాత నీటిని సాగనంపి కొత్త నీటితో కొత్త కలరివ్వాలి. ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పినట్టు రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని, అందుకు అందరూ సమ్మతించాలని, ఎవ్వరు కూడా తోకలు జాడించకుండా వారి నుంచి ప్రమాణ పత్రాలు కూడా జగన్ రాయించుకున్నారు ఎంతో ముందుచూపుతో. జగన్ మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు 20 మంది కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు.  వచ్చే దసరాకు కేబినెట్ రీషఫుల్ చేయాలనే యోచనలో జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరి సీటుకు  ఎసరొస్తుందో.. ఎవరు కంటిన్యూ అవుతారనేది వైసీపీలోనే గాక ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. 

ఇప్పుడున్న సమాచారం ప్రకారం పద్దెనిమిది మందికి పైగా మంత్రులకు ఉద్వాసన తప్పదంటున్నారు. కొత్తవారికి చాన్స్ ఇవ్వడంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. తొలి దఫాలో రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూలు), మేకపాటి గౌతమ్‌రెడ్డి ( నెల్లూరు), బాలినేని శ్రీనివాస రెడ్డి ( ప్రకాశం)కి కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం నుంచి గెలుపొందిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలుచేసినా జగన్ కరుణించలేదు. తరువాత  చూద్దాం లే అంటూ దాటవేశారు. ఇప్పుడు వారంతా తమకు తప్పకుండా చోటు దక్కుతుందన్న భావనలో ఉన్నారు. 

శ్రీకాకుళం నుంచి:
ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పల రాజు మంత్రివర్గంలో వున్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన ధర్మాన కృష్ణ దాస్ ది కొప్పులవెలమ సామాజిక వర్గం. సీదిరి అప్పల రాజు అనూహ్యంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నవారు. గుంటూరు జిల్లా రేపల్లె లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణరావుకి సామాజిక సమీకరణలో భాగంగా జగన్ కేబినెట్ లో చోటు దక్కింది. మోపిదేవిని ఆ మధ్య రాజ్యసభకు పంపడంతో ఏర్పడిన ఖాళీని అప్పల రాజుతో పూరించారు. ధర్మాన కృష్ణ దాస్ ను తొలగించి ధర్మాన సోదరుడు మాజీ మంత్రి అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. 

ఇక స్పీకర్ గా ఉన్న ఒకనాటి మాజీ మంత్రి కళింగ సామాజికవర్గానికి చెందిన ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ గా వైదొలిగి మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం నుండి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మహిళా కోటాలో... ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు మంత్రి పదవి ఆశిస్తున్నా వీరిద్దరూ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి చాన్స్ లేనట్టేంటున్నారు.

విజయనగరం నుంచి:
చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో కొనసాగుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. గిరిజన కోటాలో అత్యున్నత పదవి పొందిన పుష్పశ్రీవాణి పనితీరు బాగుందని టాక్. అయితే జిల్లాలో బొత్స శిష్యుడు వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస రావు (కృష్ణా జిల్లా) ని మంత్రి మండలి నుండి తప్పిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. జిల్లాలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ తో పాటు బొత్స సోదరులు అప్పల నర్సయ్య, మేనల్లుడు బడుకొండ అప్పల నాయుడు ఎమ్మెల్యేలు గా రాణిస్తున్నారు. పుష్పశ్రీవాణి ని మార్చాల్సి వస్తే జిల్లాలోని సాలూరు ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలుపొందిన గిరిజనుడు పి. రాజన్నదొర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

విశాఖపట్నం నుంచి:
విశాఖ జిల్లా మొత్తం మీద ఒకే ఒక్కడిగా మంత్రిమండలిలో వెలుగొందుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందుగా వైకాపా లో చేరారు. అప్పటి వరకు తెదేపా ఎంపిగా అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించిన ముత్తంశెట్టి వైకాపాలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎకాఎకిన మంత్రి అయిపోవడం వైకాపా లోని చాలామంది సీనియర్ నేతలకే అంతుచిక్కలేదు. అయితే ముత్తంశెట్టిని మార్చాల్సి వస్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 

తూర్పు కాపు (బిసి) సామాజిక వర్గం నుండి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కొప్పుల వెలమ (బిసి)ల కోటా లో నర్సీపట్నం ఎమ్మెల్యే, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర గణేష్ లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమా శంకర్ గణేష్ అప్పటి మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని భారీ ఆధిక్యతతో ఓడించడం కలిసొచ్చే అంశం. కొప్పుల వెలమల నుండి ధర్మాన బ్రదర్స్ లో ఒకరికి శ్రీకాకుళం జిల్లా నుండి ఛాన్స్ ఇచ్చినా మరొకరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉమా శంకర గణేష్ ప్రయత్నాలు వేగిరం చేశారు. ఇందుకు సోదరుడు పూరీ జగన్నాధ్ కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

తూర్పు గోదావరి నుంచి:
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్న బాబు, అమలాపురం ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ లు మంత్రి మండలిలో వున్నారు. కురసాలను కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోంది. తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా కూడా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో రేసులో ఉన్నారు. ఇటీవలే శాసనమండలికి ఎంపికైన తోట త్రిమూర్తులు కూడా పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. తోట త్రిమూర్తులుకి వరసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్న నేపథ్యంలో త్రిమూర్తులుకి చోటు లేనట్టేనంటున్నారు. దళిత సామాజికవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ని మార్చబోవడం లేదు. శాఖ మారితే మారొచ్చు అంటున్నారు.

ఈ జిల్లా లో కాపులుగా చలామణీ అయ్యే తెలగ బలిజ సామాజిక వర్గం నుండి కురసాల కన్నబాబును మినహాయిస్తే దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజా ( రాజానగరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)తో పాటు.. తోట త్రిమూర్తులు ఒక్క ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. 

పశ్చిమ గోదావరి నుంచి :
ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట ఎమ్మెల్యే సి.హెచ్. శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే తానేటి వనితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆళ్ల నాని కొనసాగనుండగా రంగనాథ రాజు, తానేటి వనితల్ని తొలగించనున్నట్టు సమాచారం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజు స్థాననంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా యాదవ సామాజిక వర్గం నుండి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండడంతో కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతున్నారు. ఆళ్లనాని సామాజికవర్గానికే చెందిన భీమవరం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి రేసులో ఉన్నారు. 

కృష్ణా నుంచి:
కృష్ణా జిల్లా బందరు నుండి పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రివర్గంలో ఉండగా తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానికి ఉద్వాసన కలిగించి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. వైశ్యుల కోటాలో వెలంపల్లి శ్రీనివాసరావు ప్లేస్ మెంట్ సురక్షితంగానే కనిపిస్తున్నా... విజయనగరం నుండి వీరభద్రస్వామి, ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి అన్నా రాంబాబు తమ ప్రాధాన్యతను గుర్తించాల్సిందిగా పట్టు బడుతున్నారు. వెలంపల్లిని తప్పిస్తేనే మరొకరికి ఛాన్స్ దొరుకుతుంది. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఆశిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి యాదవ్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ లు వెనుకబడిన తరగతుల కోటాలో మంత్రి పదవి ఆశిస్తుండగా వీరిలో ఒకరికి తప్పక అవకాశం ఉంటుందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే తానేటి వనితను తప్పించి ఆ ఖాళీని కృష్ణా జిల్లా నుండి భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాలు కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో మంత్రులు కొలువు తీరే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుండి నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముగ్గురు గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా నుండి నలుగురికి తగ్గకుండా అవకాశం లభించే వీలుంది.

గుంటూరు నుంచి:
పత్తిపాడు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఎం.సుచరిత హోమ్ మంత్రిగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వరుసగా నాలుగుసార్లు గెలిచిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా రెండుసార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సాగుతోంది. ఆశావహులలో ప్రత్యేకించి పేర్కొన దగినవారు ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బి.సి. రజక సామాజికవర్గానికి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే. ఇటీవల విడుదల రజిని ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశం అయ్యింది. 

ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రివర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నారు. వరుసగా రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలిచి రావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు పై భారీ ఆధిక్యంతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు. భంగపాటు తప్పలేదు. ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు. 

ప్రకాశం నుంచి:
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎర్రగొండ పాలెం (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి ఎం.మహీధర్ రెడ్డి (కందుకూరు) కి అవకాశం ఉందంటున్నారు. వైశ్యుడైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నా రాంబాబు 78 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక కారణంగా చూపుతున్నారు.

నెల్లూరు నుంచి:
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనుండగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఒకవేళ గౌతమ్ రెడ్డిని తప్పించాల్సివస్తే.. సీనియర్ అయిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే చాన్సుంది. 
సూళ్లూరుపేట (ఎస్సీ) రిజర్వుడ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని తప్పిస్తేనే కిలివేటి సంజీవయ్య కు ఛాన్స్ అని తెలుస్తోంది.

చిత్తూరు నుంచి:
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వర్గంలో కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దళిత సామాజికవర్గం నుండి కె.నారాయణస్వామిని తప్పిస్తే నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురం, కడప జిల్లాల నుండి కానీ దళితులకి అవకాశం కల్పిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కె. రోజా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కడప నుంచి:
కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కొనసాగుతారు. ఈసారి ముస్లిం మైనారిటీల నుండి మరొకరికి కూడా అవకాశం కల్పించాలనే సమీకరణాలలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్ సొంత జిల్లా కావడంతో మైనారిటీలతో పాటు దళితులకు కూడా పెద్దపీట వేయాలని యోచిస్తున్నారు. బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మరణించడంతో రైల్వే కోడూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒక్కరే మిగిలారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు మూడుసార్లు వైకాపా తరపున గెలిచి రావడం ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తమ్మీద ఇద్దరు తక్కువ కాకుండా మంత్రుల్ని దళిత సామాజిక వర్గం నుండి ఎంపిక చేసే అవకాశం ఉంది. 

అనంతపురం నుంచి:
పెనుకొండ ఎమ్మెల్యే, కురబ(బిసి) సామాజిక వర్గానికి చెందిన ఎమ్.శంకర్ నారాయణ ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న ఏకైక మంత్రి. కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి పదవిని ఆశిస్తున్న జిల్లా అనంతపురం జిల్లా కావడం విశేషం. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరి స్థాయిలో వారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం రకరకాల కారణాలు చూపుతున్నా... పరిటాల సునీతపై రెండు సార్లు ఓడిపోయి పరిటాల శ్రీ రామ్ ని 2019లో ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్.పి. కూడా అయిన అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో చూడాలి. ఈ జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఉషశ్రీ చరణ్... రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. తను కురబ (బి.సి) సామాజిక వర్గం, భర్త రెడ్డి కావడంతో సమీకరణ సరిపోతుందంటున్నారు. 

దళితుల కోటాలో శింగనమల (ఎస్సీ రిజర్వుడ్) నుండి జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర (ఎస్సీ రిజర్వుడ్) నుండి డాక్టర్ ఎమ్.తిప్పేస్వామి పోటీపడుతున్నారు. తిప్పేస్వామి సీనియర్. ఆయన వరుసగా మూడుసార్లు గెలిచారు. అయితే తిప్పేస్వామి... ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఆదిమూలపు సురేష్ స్వయంగా బావా-బావమరుదులు. సురేష్ ని తప్పిస్తేనే తిప్పేస్వామికి అవకాశం లేకుంటే నో ఛాన్స్. 

కర్నూలు నుంచి:

ఆలూరు ఎమ్మెల్యే బోయ (బి.సి) సామాజికవర్గానికి చెందిన పి.జయరామ్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తొలిసారి మంత్రివర్గ సమయంలో ఒత్తిడికి గురైన వైకాపా అధినాయకత్వం అప్పుడు తట్టుకోగలిగిన ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టు బడుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కూడా పైరవీలు చేసుకుంటున్నారు.  మొత్తానికి 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత కొందరిని సంతృప్తి పరిచిన జగన్... మరికొందరిని రెండున్నర ఏళ్ల పాటు అని ఊరించడం వల్లే ఈ తిప్పలన్నీ అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే దసరా వరకు ఎదురు చూడాల్సిందే.

పొత్తులకు మాయావతి గుడ్ బై.. యూపీలో అధికారం కోసం ఒంటరి పోరు

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఎన్నికల పొత్తులకు గుడ్ బై చెప్పేశారు. యూపీలో బీఎస్పీకి పునర్వైభవం, పునరాధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఒంటరి పోరుకే సై అనేశారు. ఈ మేరకు గురువారం (జనవరి 14) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ,  2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి చెప్పారు. అంతే కాదు..  ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికలలో ఏ కూటమితోనూ, ఏ పార్టీతోనూ  జతకట్టకుండా  ఒంటరిగా పోటీలోకి దిగడానికే తమ పార్టీ మొగ్గు చూపుతోందన్నారు.  బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వాలు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను నిర్లక్ష్యం చేశాయని, కనీసం ఆయన మరణించిన రోజును సంతాపం దినంగా ప్రకటించలేదనీ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లింలు, ఇతర వర్గాలను చిన్నచూపు చూశారని, అదే బీఎస్పీ పాలనలో  సమానత్వం వెల్లివిరిసిందనీ, రాష్ట్రంలో మతపరమైన కలహాలు జ రగలేదనీ గుర్తు చేశారు.  ఇక ఆమె ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమన్న మాయావతి.. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెప్పారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాయావతికి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.  మాయావతి ఒంటరి పోరు ప్రకటనతో యూపీలో రాజకీయాలు రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ క‌న్ఫర్మ్ అయిన‌ట్టేనా!?

  కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండ‌గా, ఇద్ద‌రు జ‌న‌సేన‌, ముగ్గురు బీజేపీ, న‌లుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ రూపంలో  కేంద్రంలో మంత్రి ప‌ద‌వులుండ‌గా.. బీజేపీ నుంచి శ్రీనివాస‌వ‌ర్మ కూడా  కేబినేట్ లో స‌హాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి  అవ‌కాశం ల‌భించింది తొలి  మంత్రి వ‌ర్గంలోనే వీరు స్థానం సంపాదించారు. అయితే  కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మ‌రీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ ల‌భించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి  వెళ్లిన  చంద్ర‌బాబు అమిత్ షాతో భేటీలో ఈ విష‌యం  ఆయ‌న చెవిలో వేసి  వ‌చ్చారు. దీంతో ప్ర‌తిపాద‌న‌లు పంప‌మ‌ని  కేంద్రం నుంచి స‌మాచారం వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి  ప్ర‌భాక‌ర్ రెడ్డి  పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా  ఈ సారికి ఒక రెడ్డి సామాజిక‌వ‌ర్గం పేరు ప్రతిపాదించిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే  నెల్లూరు జిల్లా  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా  మారిపోయాయి. అంతే కాకుండా  ప్ర‌కాశం జిల్లాలోని  కొన్ని సెగ్మెంట్ల‌లోనూ వేమిరెడ్డి  ప్ర‌భావం ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం క‌ట్ట‌బెడితే  ఆయ‌న ద్వారా రెండు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన‌ట్టుగా  ఉంటుంద‌ని భావించిన టీడీపీ అధిష్టానం ఆయ‌న పేరు కేంద్ర మంత్రిగా  సిఫార్సు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన‌కుగానీ ఒక మంత్రి ప‌ద‌వే ఇస్తే.. బాల‌శౌరి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర ప‌ద‌వులు ఇస్తార‌న్న మాట కూడా జోరుగాన‌నే ప్ర‌చారం  సాగుతోంది. ఒక ద‌శ‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు  వినిపించిన‌ప్ప‌టికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కార‌ణం వేమిరెడ్డి  స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డి  కూడా  జిల్లాలో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌క‌త్వం వ‌హించ‌డం.. వంటి అంశాల‌ను  ప‌రిగ‌ణ‌లోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్య‌త‌ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా

ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో  కలిసి  పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.  రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను  ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు.  కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్.   మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు.   అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో   12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం  12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్  వివరించారు.  ఎంపరాడా  వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ,  కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.  బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.    చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న  ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని  విమర్శించారు.  థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.  మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ,  బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్  "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.   ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం  తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.  

ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని

గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని.  వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని   చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ   వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జగన్ పాలనా వైఫల్యం కారణంగానే   2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని  ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత  జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.  అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో  ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.   ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో  అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు.  అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా  కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో? 

అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం

అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం.  వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం,  తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు  వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.   ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.    ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.  ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది?  ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం  పార్టీ   పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు.  ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు.  అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను   గోప్యంగా ఉంచుతారు.  అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు.  ఎమ్మెల్యేలే కాదు,   అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు.  ఇది దేశంలో ఎక్కడా లేని  నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  దీని వల్ల అధికారులు,  ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు  ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.  

థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.   బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114. 

మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం.. ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో జోగురామన్న అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి జోగు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం (జనవరి 16) ఉదయమే ఆయనను హైస్ అరెస్టు చేశారు.  రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం (జనవరి 16) , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరంభం పలకనున్నారు.  ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి

  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కారణం...మంగంపేట గనులేనా?

  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  

ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.