సోనూసూద్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. కారణం అదేనా?
posted on Sep 15, 2021 @ 6:51PM
సినీ నటుడు, పేద పాలిట పెన్నిధిగా పేరు గాంచిన సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది.అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా సోనూసూద్ నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్కు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.
లాక్ డౌన్లో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడిలా సోనూసూద్ నిలిచాడు. ప్రభుత్వాలు కూడా చేయని పని సోనూ చేశాడు. సొంత ఖర్చులతో వందల బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం సోనూని రియల్ హీరోగా కొనియాడింది. కరోనా బాధితులకు ఖరీదైన మందులు ఉచితంగా సమకూర్చాడు. సెకండ్ వేవ్ సమయంలోనూ ఎంతో మంది రోగులకు ప్రాణం పోశాడు సోనుసూద్. సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. సాయం పొందిన వాళ్లు సోనూని దేవుడిలా చూస్తున్నారు. అలాంటి సోనుసూద్ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ కారణాలతోనే ఇలా జరుగుతుందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.