ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
posted on May 3, 2025 @ 3:25PM
తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని.. వాటికి బిల్లులు హోల్డ్ చేశామన్నారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని పొంగులేటి అన్నారు. ఈ పథకం నిరు పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ కామెంట్స్ చేశారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను సర్కార్ నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను మంత్రి పొంగులేటి అందజేశారు. భారతదేశంలో పేదలకు ఏటా రూ.5 లక్షలతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రమని రె మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ ఏడాది రూ.22,000 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, లబ్దిదారుల ఎంపిక త్వరలో పూర్తవుతుందని, పైలట్ గ్రామాల్లో నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.