ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి

 

ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు. 

డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు.
గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

కోనసీమలో బ్లో ఔట్.. వణికిపోతున్న జనం

కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ లేజీజ్ సంభవించింది. భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో   కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.  మూడు దశాబ్దాల కిందటి బ్లో ఔట్ ను తలచుకుని ఆందోళనకు గురౌతున్నారు.  సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే 1995 జనవరి 8న ఇదే కోనసీమలో సంభవించిన భారీ బ్లో ఔట్ ను గుర్తు తెచ్చుకుని వణికి పోతున్నారు. అప్పట్లో  కోనసీమ లోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ రిగ్గు లీకై భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.  ఆ మంటల ధాటికి ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చదనమంతా మాడి మసైపోయింది. కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. జనవరి 8న జరిగిన ఆ బ్లోఔన్ మార్చి 15 నాటికి కానీ అదుపులోకి రాలేదు. అప్పట్లో సంభవించిన ఆ బ్లో ఔట్ ప్రపంచ బ్లో ఔట్ ల చరిత్రలోనే రెండో అతి పెద్ద బ్లో ఔట్ గా చరిత్ర సృష్టించింది. ఆ బ్లో ఔట్ కారణంగా భారీ నష్టం సంభవించింది. దాదాపు రెండు నెలలకు పైగా  ఆ మంటల వేడికి పాశర్లపూడి పరిసర గ్రామాల ప్రజలు మగ్గిపోయారు. పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భారీగా ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో కోనసీమ వాసులు నాటి రోజులను జ్ణప్తికి తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజీని అరికట్టి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు. 

మైనర్ల సహజీవనం!

ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న ఉదంతం హైదరాబాద్ లో  కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేయడం  కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు  చెందిన మైనర్లైన అబ్బాయి, అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆ ఇద్దరినీ మందలించి.. కౌన్సెలింగ్ చేసి..  ముందు చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తరువాత తామే వారిరువురికీ వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా   హైదరాబాద్‌ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో  ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో  వీరి వ్యవహారం  వెలుగులోకి వచ్చింది. పోలీసులు  రంగం లోకి దిగి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరూ మైనర్లు కావడంతో..   నిబంధనల మేరకు వారిని శిశువిహార్‌కు తరలించారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని, మైనర్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు మైనర్ల సహజీవనం ఉదంతం నగరంలో కలకలం రేపింది.   తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని  మానసిక నిపుణులు అంటున్నారు.  

మదురో కోసం ప్రాణాలొడ్డిన 32 మంది క్యూబన్ కమెండోలు

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన ఆపరేషన్  32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల ప్రాణాలు తీసింది. మదురోకు రక్షణగా ఉన్న 32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారులు ఆయనను రక్షించేందుకు అమెరికా కమెండోలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడులు, నేల మీద జరిగిన భీకర కాల్పుల వల్ల ఈ మరణాలు సంభవించాయి.  క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల మరణాన్ని క్యూబా అధికారికంగా ధృవీకరించింది. ఒక దేశాధినేతను రక్షించే క్రమంలో తమ సైనికులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్న ఆ దేశం సోమ (జనవరి 5; మంగళ(జనవరి 6) వారాలను  దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది. మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని,  ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది. మదురో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత భద్రతను క్యూబా పర్యవేక్షిస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎంతమంది క్యూబన్లు అక్కడ ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 63 ఏళ్ల నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్‌ను కూడా బంధించి,  విమానంలో అమెరికాకు తరలించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురోను.. సోమవారం రోజు మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరచనున్నారు. మదురోపై అమెరికా ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాదం ఆరోపణలు మోపింది. 2020లో విడుదల చేసిన అభియోగపత్రం ప్రకారం.. మదురో ప్రభుత్వం అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను సరఫరా చేసే ముఠాలకు సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. ఈ నేరాలకు సంబంధించి ఆయనను విచారించేందుకే ఈ అపహరణ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు. దశాబ్ద కాలంగా వెనిజులాను ఏలుతున్న మదురో ఇలా అమెరికా జైలు పాలవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్యూబన్ల మరణంతో ఈ వివాదం కేవలం అమెరికా-వెనిజులా మధ్యే కాకుండా క్యూబాతో కూడా దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెట్టింది. నిందితుడిగా కోర్టు ముందుకు వెళ్తున్న మదురోకు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు ఎలా స్పందించనున్నాన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. 

అబుదాబీలో రోడ్డు ప్రమాదం.. భారత్ కు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి

విదేశీ గడ్డపై ఉపాధి పొందుతూ ఆనందంగా జీవితస్తున్న ఒక భారతీయ కుటుంబంలో   విషాదం చోటు చేసుకుంది.   అబుదాబిలో ఆదివారం (జనవరి 5) తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో వారి వారి ఇంటి పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. కేరళ  మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో లతీఫ్ కుమారులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 ఏళ్ల అషాజ్, 12 ఏళ్ల అమ్మార్, ఐదేళ్ల అయ్యష్‌లతో పాటు వారి ఇంట్లో పని చేస్తున్న బుష్రా అనే మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు కొడుకులు కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో   అబ్దుల్ లతీఫ్, రుక్సానా, మిగిలిన ఇద్దరు పిల్లలు ఎజ్జా (10), అజ్జామ్ (7)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు అబుదాబిలోని షేక్ షక్బౌట్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ జీకే కిషోర్ కుమార్ సతీమణి మృతి

  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో నిన్న అర్ధరాత్రి  మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త  ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.   ఈమె ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా ఐఏఎస్ అధికార జీకే కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికీ, పర్యవేక్షిం చడానికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు.   . ఈ నెల 7 ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా  పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.   చంద్రబాబు  పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత వేగం పుంజుకోవడం ఖాయమని   అధికారులు అంటున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి  ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం   విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. అప్పట్లో ఆయన సోమవారం కు పోలవారం అని నామకరణం చేసి మరీ క్రమం తప్పకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించేవారు. అయితే ఆ తరువాత 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తరువాత పోలవరం పనులు పడకేశాయి. మళ్లీ 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న  కనకదుర్గ అమ్మవారిని  మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు.  ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు   ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.   

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు దుర్మరణం

అమెరికా లో  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాలకొల్లు వాసులు కొటికల పూడి కృష్ణ కిషోర్, ఆశ దంపతులు గత దశాబ్ద కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, ఆశ దంపతులు అక్కడికక్కడే మరణించగా, వారి పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే భారత్ కు వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లిన వీరు.. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వారి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

అసోంలో కంపించిన భూమి.. త్రిపుర, మేఘాలయలో కూడా

అస్సాంలో  సోమవారం (జవవరి 5) తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్కర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో త్రిపురలో కూడా పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆలా ఉండగా ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

ఉగ్రవాదంపై అమెరికా అపేక్ష.. ఉపేక్ష ఎందుకు?

నార్కో టెర్రరిజం అంటూ ఒక దేశాధ్యక్షుడినే అత్యంత అమానవీయంగా ఆ దేశంపై మెరుపుదాడి నిర్వహించి మరీ అరెస్టు చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల విషయంలో ఎందుకు అపరిమితమైన ఆపేక్ష చూపుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కర్తా, కర్మా, క్రియా తానేనన్నట్లుగా అమెరికా ఎందుకు అనవసర ఆడంబరం, అనవసర పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది? ఈ ప్రశ్నలకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ ఇలా తయారైందన్న బదులు వస్తుంది.  అమెరికా తొలుత ఇలా ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ అమెరికాను తమతో పాటు పాల్గొనాల్సిందిగా కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించడమే కాదు.. కనీసం బ్రిటన్ కు మిత్రదేశంగా ఉండటానికి కూడా ముందుకు రాలేదు.  అయితే కానీ ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ ఘటన జరిగిందో ఆనాటి నుంచి అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి  కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది. అక్కడి నుంచీ తమ దేశ భద్రతకు ఆయుధ తయారీని  ఒక ప్రామాణికంగా పెట్టుకుంది. దానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తత్తి చేసిన ఆయుధాల నిల్వ భారీగా ఉండటంతో.. ప్రపంచంలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడికి తగుదునమ్మా అంటూ వెళ్లి,  ఆ దేశ సమస్యల్లో వేలు పెట్టి.. తన ఆయుధాల విక్రయానికి ఆ సమస్యలను అలంబనగా చేసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే వియత్నాం, గల్ఫ్, సిరియాయుద్ధాలు. ఆ మాటకొస్తే భారత్- పాక్, రష్యా- ఉక్రెయిన్,  చైనా- తైవాన్ ఇలా ఏ రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడ్డా తనదైన శైలిలో.. జోక్యంొ చేసుకుంటూ తనకు తానే ప్రపంచ దేశాలకు పెద్దన్న అన్నట్లుగా వ్యవహరిస్తోంది.    అమెరికా  వ్యవహారశైలి ఎలాంటిదో ఒక దళారి పశ్చాత్తాపం వంటి పుస్తకాలు చదివితే మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతగా ప్రపంచ రాజకీయాలను శాసించడం ప్రారంభించింది అమెరికా. ఇక ఇంధనం కారణంగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకానొక వ్యసనం కూడా అమెరికాకు పట్టుకుంది.  దీంతో ఆయా చిన్నా చితకా దేశాల వెంట పడడం.. వాటి సహజవనరులపై కన్నేయడం అమెరికాకు పరిపాటిగా మారింది. చివరికి గల్ఫ్ దేశాలపైనా అమెరికా ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వారి పెట్రో డాలర్లన్నీ తమ ట్రెజరీల్లో భద్రంగా ఉంచుకుని.. ఆపై వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అంతగా ఇతర దేశాల్లో కాళ్లు, వేళ్లు, తలా దేర్చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించడం అమెరికాకు రివాజైపోయింది.  తమ మాట వినని దేశాల్లో కుల మత విద్వేషాలను రాజేసి మరీ వాటిని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. అనుకున్న ఫలితం సాధించడం అమెరికా తన అగ్ర నాయకత్వంలో ఒక భాగం చేసుకుంది. ఈ విషయంలో అమెరికాకు చైనా, రష్యా, భారత్ లు కూడా మినహాయింపు కాదు.  ఇవాళ వెనిజువెల విషయంలో నార్కో టెర్రరిజం పేరిట ఆ దేశ అధ్యక్షుడు మదురో ని అరెస్టు చేసిన అమెరికా.. పాక్ లో  ఉగ్రవాదం వెయ్యి తలలు వేస్తున్నా కిమ్మనడం లేదంటే.. ఏమనుకోవాలి.  స్వయానా అమెరికా కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర బాధిత దేశాల్లో ఒకటి. అయినా అమెరికా పాక్ ఒంటిపై ఈగ వాలకుండా కాపాడటమే కాకుండా, ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి భారీ రుణాలతో ఆదుకుంటోంది. కానీ అదే అమెరికా వెనిజువేలా అధ్యక్షుడు మదురో పై 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఉందనీ, అందుకే అరెస్టు చేశామనీ చెప్పుకుంటోంది.  కానీ, హఫీజ్ సయీద్ వంటి వారిపైనా ఇలాంటి రివార్డ్ లే ఉన్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు?    పాకిస్థాన్ కి అమెరికా ఇప్పిస్తున్న  వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లోన్ల నుంచి మసూద్ అజర్ వంటి టెర్రరిస్ట్ బాసులకు భారీగా నిధులు అందుతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీని గాజాలో దింపేందుకే ఈ నజరాలు, సానుభూతి అని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అమెరికా ధ్వంస రచన ఇంకెంత కాలం సాగుతుందో చూడాలంటున్నారు అంత ర్జాతీయ వ్యవహారాల నిపుణులు.