కరోనా కేసులు 2 కోట్లు!.. మరణాలు 2 లక్షలు..
posted on May 3, 2021 @ 10:41AM
తగ్గేదే లే.. అంటోంది కరోనా. వైరస్ ఓ రేంజ్లో విజృంభిస్తోంది. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. దేశం కరోనా భారత్గా మారిపోతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68 లక్షల మందికి కొవిడ్ సోకింది. ఆ ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, కొవిడ్ టెస్టుల సంఖ్య తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,68,147 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది.
అటు, వైరస్ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కొవిడ్ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది.
అయితే, మరణాల సంఖ్య కూడా పెరగుతుండటం ఆందోళనకరం. మృతుల సంఖ్య రోజుకి 3వేలకు పైనే ఉంటోంది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. కరోనాతో ఇప్పటి వరకూ 2,18,959 మంది వైరస్కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది.
ఇక దేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఆదివారం 12లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇప్పటి వరకు 15.71కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.