హిమాచల్ప్రదేశ్: ముమ్మరంగా సహాయక చర్యలు
posted on Jun 9, 2014 8:42AM
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభించాయని మండి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.సమాచారం అందగానే ఇరవైమంది గజ ఈతగాళ్లు, పదిమంది బోట్ డ్రైవర్స్తో సహాయక చర్యలు ప్రారంభించామని, అయితే, చీకటి కావడంతో ఆదివారం రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, ఇప్పటివరకు మృతదేహాలేవీ లభించలేదన్నారు. మరోవైపు, 10 మృతదేహాలు లభించినట్లు తమకు సమాచారం ఉందని మండి జిల్లా పోలీసుకంట్రోల్రూమ్ అధికారులు వెల్లడించారు. డ్యామ్ గేట్లు తెరవడంతో అత్యంత వేగంతో నీటి ప్రవాహం కిందకు వెళ్తుందని, ఆ ప్రవాహం 35 కిలోమీటర్ల దూరంలోని పాంథా ప్రాజెక్టు వరకు సాగుతుందని మండీ జిల్లా ఎస్పీ ఆర్ఎస్ నేగీ వివరించారు. అందువల్ల గల్లంతైన విద్యార్థుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉంటారనేది చెప్పలేమన్నారు. గల్లంతైన వారిలో చాలామంది పాంథా పాజెక్టులోనే లభించే అవకాశం ఉందన్నారు.