ప్రాణాలా? ఎన్నికలా? హైకోర్టు సీరియస్..
posted on Apr 29, 2021 @ 12:56PM
ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? యుద్ధం వచ్చినా.. ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? శుక్రవారంతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది.. వాట్ నెక్ట్స్? ఇలా.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, తెలంగాన ప్రభుత్వాన్ని ఓ రేంజ్లో కడిగిపారేసింది హైకోర్టు. సర్కారు, ఎస్ఈసీ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికలు, కొవిడ్ కట్టడి విషయంలో ఈ రెండు వ్యవస్థలూ పూర్తిగా వైఫల్యం చెందాయని అసహనం వ్యక్తం చేసింది.
కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. తెలంగాణలో జరుగుతున్న మినీ పుర పోరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత చర్యలేంటని న్యాయస్థానం ప్రశ్నించగా.. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని సూచించింది.
మరోవైపు, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్ఈసీని ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఎస్ఈసీ అధికారులు తెలిపారు. దీంతో కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందంటూ మండిపడింది. ఎస్ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
తెలంగాణలో రోజుకు 10వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య మరింత భారీగా పెరుగుతోంది. లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టడం వల్లే.. కరోనా విజృంభిస్తోందని అంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా.. న్యాయస్థానం సైతం కరోనా కల్లోలంలో ఎన్నికల నిర్వహణపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ.. ఘాటైన విమర్శలు చేసింది.