జగన్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. దమ్మాలపాటికి క్లీన్చీట్.. ప్రభుత్వంపై చర్యలు?
posted on Sep 2, 2021 @ 1:58PM
న్యాయం కోర్టుల రూపంలో ఇంకా నిలిచేఉంది. న్యాయం జరగడం ఆలస్యం కావొచ్చు కానీ.. అన్యాయం మాత్రం ఎన్నటికీ గెలవదు. ఏపీలో ఈ విషయం పదే పదే నిరూపితం అవుతోంది. అమరావతిని ఎత్తేయాలనే కుట్రకూ.. హైకోర్టే బ్రేకులు వేసింది. ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులతో కక్ష్య తీర్చుకోవాలనే ఎత్తుగడలకూ హైకోర్టు ద్వారానే చెక్ పడుతోంది. వరుస ఎదురుదెబ్బలతో జగన్రెడ్డి ప్రభుత్వం నెత్తి బొప్పికడుతున్నా.. ప్రభుత్వం తీరు ఏమాత్రం మారకపోవడం దారుణమైన విషయం. తాజాగా, మరో కేసులోనూ ఏపీ హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది.
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరికొందరిపై.. ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది.
దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. హైకోర్టులో గత నెల రోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది.
గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం ఆ కేసులను కొట్టేసింది. దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేయడం మరింత ఆసక్తికరం. మరి, తనను వేధించిన సర్కారుపై దమ్మాలపాటి చట్ట ప్రకారం రివేంజ్ తీర్చుకుంటారా? మఆజీ అడ్వకేట్ జనరల్ తిరిగి కేసు పెడితే ప్రభుత్వం పరిస్థితేంటి? అనే చర్చ నడుస్తోంది.