సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష... హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు....

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు బాలికలపై పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా అత్యంత కిరాతంగా చంపేసి బావిలో పాతిపెట్టిన నరరూప రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించింది. హాజీపూర్ హర్రర్ కేసుల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు... మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, బ్లడ్ టెస్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్... ఇలా అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సమర్పించడంతో తప్పించుకోలేకపోయాడు. పోలీసులు అందజేసిన ఎవిడెన్స్ ఆధారంగా ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. మొత్తం 101మంది సాక్షులను సుదీర్ఘంగా విచారించిన కోర్టు... శ్రావణి, కల్పన, మనీషా కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది.

అయితే, మూడు కేసుల్లోనూ నేరం రుజువైందంటూ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి న్యాయమూర్తి తెలియజేయగా, తనకేం సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ జడ్జికి విన్నవించుకున్నాడు. తన తల్లిదండ్రులను తానే పోషించాలని... తన ఇల్లు కూల్చేశారంటూ న్యాయమూర్తికి తెలియజేశాడు. భూతగాదాలతోనే తనను ఈ కేసుల్లో ఇరికించారంటూ న్యాయమూర్తికి చెప్పుకున్నాడు. అయితే, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అంటూ శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చాడు.

మొత్తానికి హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై బాధితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వెంటనే ఉరిశిక్ష అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Teluguone gnews banner