ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, మహాకూటమి కలిసిపోతాయి
posted on Nov 26, 2018 @ 2:07PM
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గత కొంతకాలంగా ఏదో ఒకటి మాట్లాడుతూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ మీద, మహాకూటమి మీద తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటకలో లాగా తెలంగాణలోనూ బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఒకే గూటికి చెందినవని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్, మహాకూటమి కలిసిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని అన్ని పార్టీలతో కేసీఆర్ గతంలో పొత్తు పెట్టుకున్నారని.. వీరందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మాఫీయా, రాజీవ్ గృహకల్పలో అక్రమాలపై కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని కేసీఆర్ మరచిపోయారు. ఎందుకంటే సోనియా, రాహుల్ పట్ల ఆయనకు ఎంతో అభిమానం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఒంటరిని చేయడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రయత్నిస్తున్నాయని.. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా బీజేపీని ఏం చేయలేరని స్పష్టం చేశారు. మేడ్చల్ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సోనియా గాంధీ పథకం వేశారని విమర్శించారు. 2013లో నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రత్యేకహోదాను రద్దు చేశారని జీవీఎల్ తెలిపారు. చట్టంలో లేనప్పటికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్తో పాటు ఇతర మార్గాల ద్వారా ఏపీని ఆదుకున్నామని జీవీఎల్ స్పష్టం చేశారు.