పార్టీ కేడర్ ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యే!!
posted on Feb 13, 2020 @ 2:47PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజక వర్గం వైసీపీకి కంచుకోట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ ఆవిర్భావం తర్వాత తుడిచి పెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు నిలబడ్డారనేది చూడకుండా ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేయడంతో వరుసగా రెండు పర్యాయాలు అక్కడ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార టిడిపిలో చేరి పోయారు. దీంతో స్థానికంగా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అందుకే 2019 లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబును బంపర్ మెజారిటీతో గెలిపించారు. గిద్దలూరు ఎమ్మెల్యేగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన అన్నా రాంబాబు మునుపెన్నడూ లేని విధంగా కార్యకర్తలు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. పనులు చేయించుకునే విషయంలో ముప్పేట దాడి చేస్తున్నారు సొంత పార్టీ నాయకులు.
మొత్తం నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్న నేపధ్యంలో ప్రతి మండలంలోనూ వైసీపీలో మూడు, నాలుగు వర్గాలున్నాయి. వారందరినీ ఏకతాటి పై నడిపించేందుకు సాధ్యమవడం లేదంటున్నారు కొందరు నేతలు. దీంతో ఏ వర్గానికీ పని చెయ్యాలో తెలియక రాంబాబు తల పట్టుకుంటున్నారు. చేతిలో పరిమిత అవకాశాలుండటం, నేతలు ఎక్కువ మంది ఉన్న నేపధ్యంలో ఎటు వైపు మొగ్గు చూపితే ఏమవుతుందోననే ఆందోళనలో ఎమ్మెల్యే ఉన్నారు. ఒక వర్గానికి సిఫారసు చేస్తే మరో వర్గం దూరమవుతుందనే ఉద్దేశంతో ఎవరికీ పనులు చేయకుండా అసలు తన వద్దకే రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అన్నా రాంబాబు. దీంతో వైసీపీ వర్గాలు ఆయన పై గుర్రుగా ఉన్నాయనే టాక్ గిద్దలూరు నియోజక వర్గాల్లో వినిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓటు వేసినా సామాన్య ప్రజలు సైతం తమకు పనులు చేసిపెట్టాలని అన్నా రాంబాబును సంప్రదిస్తుంటే వారి పై మండిపడుతున్నారు. తానేమీ చేయలేనని తన వద్దకు వచ్చిన ప్రయోజనం లేదని చెపుతున్నట్లు కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు జనాలు కూడా ఏదో చేస్తారని గెలిపిస్తే ఇలా చేస్తున్నారేంటని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.