హైదరాబాద్ ఆగమాగం.. కేసీఆర్ సర్కారు టెన్షన్...
posted on Sep 13, 2021 @ 10:52AM
ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది. హైకోర్టు తీర్పు జీహెచ్ఎమ్సీ నెత్తిన పిడుగులా పడింది. హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై కోర్టు కఠిన ఆంక్షలు విధించింది. వాటిని పాటించలేక.. వేరే ప్రత్యామ్నాయం లేక.. లబోదిబోమంటూ మళ్లీ హైకోర్టునే ఆశ్రయించింది తెలంగాణ సర్కారు.
గణేశ్ నిమజ్జనంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు.
హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. సాగర్లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని.. హుస్సేన్ సాగర్లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని పిటిషన్లో జీహెచ్ఎంసీ కోరింది.
ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ పిటిషన్లో విన్నవించింది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని వివరించింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి.. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని తెలిపింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని పిటిషన్లో చెప్పింది.
ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని.. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని జీహెచ్ఎమ్సీ ఆందోళన వ్యక్తం చేసింది.