100 రోజుల్లో 5 కొత్త పాలసీలు.. చంద్రబాబు స్పీడ్ మామూలుగా లేదుగా!?
posted on Jul 31, 2024 @ 4:37PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పరుగులెత్తించేందుకు అవసరమైన కొత్త పాలసీల రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నారు. తాను స్వయంగా రోజుకు 18 గంటలు పని చేస్తూ వరుస సమీక్షలతో , విస్పష్ట ఆదేశాలతో దిశా నిర్దేశం చేస్తూ అధికారులను పరుగులెత్తిస్తున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త పాలసీల రూపకల్పనపై బుధవారం (జులై 31) అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ సందర్భాలలో వివిధ సంస్థలతో పెట్టుబడుల కోసం చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత స్థితిపై చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా...తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా అప్పట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి. జగన్ సర్కార్ పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులకు గురి చేయడం, రాజకీయ వేధింపులకు పాల్పడటంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అదే సమయంలో జగన్ విధానాల కారణంగా కొత్త పరిశ్రమలేవీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఈ విషయాలన్నీ కూలంకుశంగా చర్చించిన చంద్రబాబు మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అసవరం ఉందని, అందుకు అనుగునంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం జగన్ సర్కార్ వెనక్కు తీసుకున్న విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అసవరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా...అందుకు భిన్నంగా పరిశ్రమలకు కేటాయించే స్థలాలు ఇచ్చారన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే....వైసీపీ ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు.
2014 -2019 కాలంలో 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే....2019 -2024 మధ్య కేవలం 31 పార్కులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రమిక వేత్తలు, పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు. నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరం అయితే తాను కూడా వారితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. తద్వారా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి...పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం అదేశించారు.
వచ్చే 100 రోజుల్లో కొత్తగా 5 పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రీయల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా చెయ్యాలనే లక్ష్యంతో విధానాల రూపకల్పన జరగాలన్నారు. అదే విధంగా కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లష్టర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లష్టర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా క్లష్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని సిఎం అన్నారు. అలాగే కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ పురోగతిపై చర్చించారు. నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు అయ్యే ఎన్టీపీఎస్ గ్రీన్ హైడ్రొజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బిపిసిఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.