ఫిబ్రవరి 19న అయోద్య ట్రస్టు తొలి సమావేశం...
posted on Feb 10, 2020 @ 1:20PM
అయోధ్య రామమందిర నిర్మాణానికి తొలి అడుగు త్వరలోనే పడనుంది. కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్టు తొలి సమావేశానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రస్ట్ లో నామినేటెడ్ సభ్యుల ఎంపికతో పాటు కీలక నిర్ణయాలను ఈ మీటింగ్ లో తీసుకోబోతున్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 న ఢిల్లీ లోని ట్రస్టు శాశ్వత కార్యాలయంలో సమావేశం జరగనుంది. ట్రస్టు శాశ్వత కార్యాలయంగా గ్రేటర్ కైలాష్ లోని, ఆర్-20 భవంతిని ఎంపిక చేశారు. ఈ కార్యాలయం ట్రస్టు చైర్మన్ పరాశరన్ కు చెందినది.
కేంద్రం ఇది వరకే జారీ చేసిన నోటిఫికేషన్ లోని అంశాల మేరకు తొలిసారి భేటీ కానున్న అయోధ్య టెంపుల్ ట్రస్టు ఆ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరుగురు నామినేటెడ్ సభ్యుల ఎంపిక కూడా అదే రోజున జరగనుంది. రామజన్మభూమి ట్రస్టులో మొత్తం పదిహేను మంది సభ్యులు ఉంటారని ప్రకటించిన కేంద్రం వారిలో తొమ్మిది మంది శాశ్వత, ఆరుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్మన్ పరాశరంతోపాటు వాసుదేవానంద్, మాధవాచార్య స్వామి, యుగపురుషు పరమానంద, స్వామి గోవిందదేవ్, విమలేంద్ మోహన ప్రతాప్ మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా, పాట్నాకు చెందిన కమలేశ్వర్ చోపాల్, నిర్మోహి అఖాడా చీఫ్, మహంత ధీరేంద్ర దాస్ శాశ్వత సభ్యులుగా ఉన్నారు.
రామజన్మభూమి ట్రస్టు తొలి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాత్కాలిక సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటారు, ఎలాంటి విధి విధానాలను ప్రకటిస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకొనే పూర్తి స్వేచ్ఛ శ్రీరామజన్మభూమి ట్రస్టుకు ఉంటుందని, విరాళాల సేకరణ, పెట్టుబడుల వంటి వ్యవహరాలు అదే చూసుకుంటుందని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. అయోధ్య టెంపుల్ ట్రస్టు ఎప్పటికప్పుడు లెక్కలు పక్కాగా రాయాలని నిర్ణీత కాలవ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.