కరోనా తో చెన్నై లో కన్నుమూసిన నెల్లూరు సర్జన్
posted on Apr 12, 2020 @ 8:12PM
నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నగరంలోని ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్ధోపెడిక్ సర్జన్ లక్ష్మీనారాయణ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే ముందుగా గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించింది.
నెల్లూరులోనే ఐసోలేషన్ వార్డులో వుంచి ఆయనకు ప్రత్యేకంగా చికిత్సలు చేయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. అయితే వెంటిలేటర్ కూడా అమర్చేందుకు కొంతమంది డాక్టర్లు, అనస్తీషియా సిబ్బంది రాకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయనను నాలుగైదు రోజుల క్రితం నెల్లూరు నుంచి చెన్నయ్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి ఆయనకు చికిత్సలు మొదలుపెట్టారు. అప్పటికే ఆయన పరిస్థితి విషయంగా వుండడం, వైద్యానికి ఆయన శరీరం స్పందించకపోవడంతో... చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
ఆయన మృతిచెందిన విషయాన్ని డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆయన డెడ్ బాడీని నెల్లూరుకు తరలించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చెన్నయ్ లోనే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశముంది.