నకిలీ మద్యం కేసులో సూత్రధారులకు చుక్కలు చూపిస్తాం : మంత్రి కొల్లు

 

నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం నాణ్యత లేని, హానికరం కాని పదార్థాలు ఉపయోగించినట్లు తేలిందని మంత్రి పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చుక్కలు చూపిస్తామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానికి మతిచేడి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. రూ.99 బ్రాండ్లు నిలిపివేశామనడం చెప్పడం ఆయన ఆజ్జానానికి నిదర్మనమన్నారు. జనార్థన్ రావు తన ఇంటికి వచ్చినట్లు జోగి రమేశ్ అంగీకరించారని మంత్రి కొల్లు అన్నారు. వాస్తవాలు బయటకు వస్తుంటే జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని పేర్కొన్నారు. 

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను స్కాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా?అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీని తరిమికొట్టారని తెలిపారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. సిట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామని గుర్తు చేశారు.

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!

వచ్చే ఏడాది జరగనున్న   ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత జట్టుకు బంపర్ ఆఫర్ తగలనుంది. ఫిఫా ప్రపంచ కప్  టోర్నీ ఛాంపియన్‌కు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.  2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.  అంటే 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫాభారీగా పెంచింది. 2022 కప్‌ టోర్నీ  మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఇప్పుడు దానిని భారీగా రూ.5911 కోట్లకు పెంచారు. గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి. జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు రూ.13.53కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు రూ.99.27 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లకు రూ.171 కోట్ల చొప్పున దక్కుతాయి. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు, మూడో స్థానాన్ని సాధించే టీమ్ రూ.261 కోట్లు సంపాదిస్తాయి.  రన్నరప్‌కు రూ.297 కోట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ విజేతతో పోలిస్తే క్లబ్ ప్రపంచ కప్‌లో గెలిచే జట్టుకే ఎక్కువ నగదు బహుమతి దక్కనుంది. 2025 క్లబ్ ప్రపంచ కప్ నెగ్గిన చెల్సీకి రూ.1128 కోట్లు లభించాయి. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్ జట్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చులు అవుతుండటంతో ఫిఫా అందుకు తగ్గట్టే ప్రైజ్‌మనీ అందిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. రిపేర్లు మొదలుపెట్టిన పాక్

జమ్మూ కశ్మీర్‌  పహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన  ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సందర్భంగా భారత్ దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనం ధ్వంసమైందనీ,  ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ లో దెబ్బతిన్న ఇతర ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మతులు జరుగుతున్నా యి.    26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనానికి పాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్టు తాజాగా హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో భవనం పైకప్పు కూలిపోయి, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. డిసెంబర్ 16 నాటి వంటోర్  ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. ఈ టార్పాలిన్‌ను రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయి. జూన్ నెలలో తీసిన ఫోటోల్లో భవనంపై చిన్న ఆకుపచ్చ టార్పాలిన్ కనిపించింది. ఇప్పుడు మొత్తం భవనం పెద్ద టార్పాలిన్ కింద మరమ్మతు లేదా పునర్నిర్మాణంలో ఉంది. దీనిపై దాడికి రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణులు భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి  ముఖ్యమైన స్థావరం. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ టిబి2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను  ఆపరేట్ చేస్తారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ కోసం భారత్ డీజీఎంఓకి కాల్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ముందు 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్‌ దాడులకు తెగబడటంతో ప్రతిగా భారత వాయు సేన ఈ దాడులు చేసింది. ఈ సమయంలో ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై పాక్ దాడులు చేసింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపుర్, భుజ్‌లలోని ఐఏఎఫ్ స్థావరాలకు, సిబ్బందికి స్వల్ప నష్టం జరిగింది. మే 10న మురిద్‌పై భారత్ రెండో దాడి చేయగా.. అక్కడ భూగర్భ సదుపాయానికి 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ భూగర్భ స్థావరం ప్రత్యేక పరికరాల నిల్వకు లేదా భారీ బాంబు దాడులను తట్టుకోగలిగేందుకు ఉద్దేశించినదట. దాడులకు గురైన తన ఎయిర్‌బేస్‌లలో పునర్నిర్మాణ పనులు దాయాది దేశం ప్రారంభించింది. సర్దార్‌లోని ముషఫ్ ఎయిర్‌బేస్, దక్షిణ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లోని దెబ్బతిన్న రన్‌వేలను మరమ్మతు చేసుకుంది. జాకబ్‌బాద్, భోలారి, సుక్కూర్‌లలోని హ్యాంగర్‌లు ధ్వంసమయ్యాయి. జాకబ్‌బాద్‌లో పలుఎ ఫ్-16 ఫైటర్ విమానాలు ధ్వంసమైనట్టు నివేదికలు వచ్చాయి. భోలారిలోని హ్యాంగర్‌పై దాడిలో ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైంది. సుక్కూర్‌లో హ్యాంగర్‌ను నేలమట్టం చేసింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత వైమానిక దళం జరిపిన  దాడులలో ధ్వంసమైన కాంప్లెక్స్ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టింది.

పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాక్!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి ససేమిరా అంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందనీ, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ నో అంది. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా, ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి.   విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం  లగ్జరీ వస్తువులుగా పరిగణించాల్సి రావ డం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రుణం కోసం ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ నానా పాట్లూ పడుతోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే  వదిలేయాల్సిన దుస్థితిలో పాకిస్థాన్ ఉంది. 

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థిని మృతి

గురుకులంలో  ఫుడ్ పాయిజినింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మరణించింది. ఈ ఘటనఅస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌లోని   సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్‌కు చెందిన లింగం కుమార్తె 14 ఏళ్ల సాయి లిఖిత ఈ గురుకుల పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 5న కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను  మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు కూడా ఫుడ్ పాయిజినింగ్ అయ్యిందని ధృవీకరించారు. చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు జాండిస్ అటాక్ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను మరింత మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌  నిలోఫర్‌ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖిత బుధవారం (డిసెంబర్ 17) కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా గురువారం (డిసెంబర్ 18) పాఠశాలను సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్‌ అన్నారు. 

టోల్ గేట్లకు చెల్లు చీటీ!

ఇక టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఉండవు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్లనూ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే టోల్ వసూళ్లు మాత్రం ఆగవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఇక నుంచి ఏఐ,  శాటిలైట్  ఆధారిత సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు జరిగేలా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయాన్ని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ఈ నూతన టోల్ విధానం  పూర్తిగా ఉపగ్రహ, ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఉంటుందన్నారు. దీని వల్ల వాహనదారులు  టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. దీని వల్ల వాహనదారులకు  ఇంధనం ఆదా అవడమే కాకుండా,  ప్రభుత్వానికి అదనంగా ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు.   ఈ విధానంలో టోల్ గేట్లకు బదులుగా గాంట్రీ గేట్స్ నిర్మిస్తారు.  వీటిపై   హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చడం ద్వారా,  వాహనాలు గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ వాహనం  నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది.  దీంతో టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయని గడ్కరీ తెలిపారు.

ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ విఫలయత్నం!

ఆస్ట్రేలియా రాంకీ బీచ్ కాల్పుల నిందితుడు ఆస్ట్రేలియా-భారత్ మధ్య తరచూ రాకపోకలు ఆస్ట్రేలియా సిడ్నీ రాంకీ బీచ్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో హతమైన ఐసిస్ అనుబంధ ఉగ్రవాది సాజిత్ అక్రమ్  గతంలో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.  ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి సారీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపాయి.   హైదరాబాద్‌లోని జోచిచాక్ అల్ హసన్ కాలనీలో నివసిస్తున్న సాజిత్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 27 ఏళ్లుగా సాజిత్ హైదరాబాద్, ఆస్ట్రేలియా మధ్య  రాకపోకలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో  బీఏ పూర్తి చేసిన సాజిత్ అక్రమ్, 1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000లో అక్కడే బియాన్ వెనెస్సా గోసాను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ కావడంతో, 2001లో సాజిత్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు. తదనంతరం 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందిన సాజిత్, పీఆర్ హోదాను కొనసాగించాడు. పీఆర్ కలిగిన వారికి ఐదేళ్లపాటు ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చి వెళ్లే అవకాశం ఉండటంతో, అతడు ఈ వీసా ద్వారా దేశంలో తన ఉనికిని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు, పాస్‌పోర్టు, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలంటే పౌరసత్వం అవసరం. ఈ నేపథ్యంలో సాజిత్ అక్రమ్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అయితే ప్రతి దరఖాస్తు తిరస్కరణకు గురైందని, తిరస్కరణ కారణాలను సాజిత్ ఎప్పుడూ తమతో పంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు  తెలిపారు. సాజిత్ కుమారుడు నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో జన్మించడం తో అతడికి ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు లభించాయి.  2003లో తొలిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిత్, కుటుంబీకుల సమక్షంలో సంప్రదాయ నిఖా చేసుకున్నాడు. 2004లో తన కుమారుడిని బంధువులకు చూపించేందుకు మరోసారి నగరానికి తీసుకువచ్చాడు. 2006లో తండ్రి మృతి అనంతరం కుటుంబీకులను కలుసుకుని వెళ్లిన సాజిత్, 2018లో వారసత్వంగా తనకు వచ్చిన శాలిబండ లోని ఇంటిని విక్రయించేం దుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ఆస్తి విక్రయం తో వచ్చిన డబ్బుతో ఆస్ట్రే లియాలోని బోసరగ్ ప్రాంతం లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో తన వాటాను కూడా భార్య పేరు కు బదిలీ చేసినట్లు సమా చారం. 2012 ఫిబ్రవరిలో సాజిత్ అక్రమ్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి కుటుం బీకులను కలుసుకుని వెళ్లాడు. అదే సమయంలో పదేళ్ల కాలపరిమితికి సంబం ధించిన పాస్‌పోర్టు రిన్యూ వల్ కూడా చేయించుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సిడ్నీ కాల్పుల ఘటన నేపథ్యంలో సాజిత్ అక్రమ్ గత జీవితం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, సంబం ధాలపై భారతీయ, ఆస్ట్రే లియా భద్రతా సంస్థలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌  కేసు మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేశారు.  ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి  ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలుస్తోంది 

అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. భారత్ హైకమిషన్ కార్యాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.   బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నెల 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల  15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హాదీ బుధవారం (డిసెంబర్ 18) రాత్రి మరణించాడు. దీంతో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు తెగబడ్డారు. చిట్టగాంగ్ లోని భారత హైకమిషన్ కార్యాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అలాగే దేశ వ్యాప్తంగా పలు నగరాలలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితుుల నెలకొన్నాయి.  రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలూ   దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా సంస్థలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు.  అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో  డైలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు.    అలాగే  అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.   

ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ

దివంగత ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న  ఎన్టీఆర్ రాజు  బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం (డిసెంబర్ 18) తిరుపతిలో జరిగాయి.   రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు.  ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా వద్దని తిరస్కరించి, ఆజన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు. పదవులు కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలస్తుంది. అటువంటి ఎన్టీఆర్ రాజు అంత్యక్రియలకు   నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ  హాజర య్యారు. నందమూరి కుటుంబం తరఫున ఎన్టీఆర్ రాజు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొని పాడె మోశారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకీ, నందమూరి కుటుం బానికీ తీరని లోటని వారన్నారు.  నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందిం చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నట్టు పేర్కొన్నారు. 

పెరిగిన చలి తీవ్రత...స్కూల్స్ టైమింగ్స్ మార్పు

  తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగటంతో జిల్లా కలెక్టర్ స్కూల్స్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 4 :15 గంటల వరకు ఉన్న బడి సమయాలను ప్రస్తుతం 09:40 గంటల నుంచి సాయంత్రం 04 :30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ స్కూల్ టైమింగ్ మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత మూడు రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు