వైఎస్సార్ వల్లే రాష్ట్ర విభజన.. చంద్రబాబుకు తుళ్లూరు శాపం..
posted on Mar 20, 2021 @ 3:12PM
ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ రాజశేఖర్రెడ్డే కారకుడు. అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది నాటి వైఎస్సారే. చెన్నారెడ్డితో మొదలైన ఉద్యమం ఉస్మానియాకు చేరింది. ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలోకి వెళ్లింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర విభజనకు కారకుడు తన మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డే అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నానంటూ చింతా మోహన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.
దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరామన్నారు. తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందన్నారు చింతా మోహన్. తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానన్నారు. తుళ్లూరులో అడుగు పెట్టి చంద్రబాబు మటాస్ అయ్యారని, అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయన్నారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదన్నారు. జగన్కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
టీడీపీ మునిగిపోయే నావా అని.. చంద్రబాబు చల్లని రూపాయని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని.. బోగస్ ఎన్నికలను నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి వల్ల 5 లక్షల మంది ప్రైవేటు టీచర్స్ రోడ్డున పడ్డారన్నారు. 50 వేల ప్రైవేటు విద్యా సంస్థలు మనుగడ కోల్పోయాయన్నారు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందన్నారు చింతా మోహన్. తిరుపతి బై పోల్ చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని.. దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలన్నారు. బ్యాంకులు, రైల్వే, ఎల్ఐసీ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పబట్టారు. బీజేపీ, వైసీపీకి తేడా లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.