ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఎన్నికల కమిషన్ చర్య
posted on Mar 14, 2020 @ 1:02PM
తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.
ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తెది నుండి అమల్లోకి వచ్చినందున, ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించడ మైనదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి ఎన్నికల సంఘం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.
స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ దివాకర్రెడ్డి లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.