టీఆర్ఎస్ కు ఊహించని షాక్.. ఫుల్ జోష్ లో కాంగ్రెస్!!

 

రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ.. ఏ ఇతర పార్టీకి మద్దతిస్తుందో ఊహించడం చాలా కష్టం. అలాంటిదే హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతివ్వడం. అసలు సీపీఐ తీసుకున్న నిర్ణయానికి దాదాపు అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు సీపీఐ మద్దతు ఉపసంహరించుకొని టీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చింది.

హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టుగా గ‌త‌వారంలో సీపీఐ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే.. మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ కు స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగా సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సీపీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వామపక్షాలను తోక పార్టీలన్న కేసీఆర్ చెంతకు ఎలా చేరతారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. క‌మ్యూనిష్టుల‌పై నానావిమ‌ర్శ‌లు చేసిన కేసీఆర్ కి ఎలా మ‌ద్ద‌తు ఇస్తారు?, చేజేతులా పార్టీని ఉనికి కోల్పోయేట్టు చేస్తున్నారంటూ సీపీఐ తీరుపై విమ‌ర్శ‌లు వినిపించాయి. 

దానికితోడు అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తెర మీదికి వ‌చ్చింది. దీంతో హుజూర్ న‌గ‌ర్లో టీఆర్ఎస్ కి ఇచ్చిన మ‌ద్ద‌తుపై సీపీఐ పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. వామపక్షాలు అంటేనే కార్మికుల పక్షాన పోరాడే పార్టీలుగా పేరుంది. అలాంటిది కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా అంతమంది కార్మికులు రోడ్డెక్కితే.. అదే కేసీఆర్ పార్టీకి మద్దతిచ్చి తప్పు చేస్తారా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో సీపీఐ ఆలోచనలో పడింది. చివ‌రికి టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తుని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టుగా చాడా వెంక‌ట రెడ్డి ప్ర‌కటించారు. ఆర్టీసీ ప‌ట్ల కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి మీద విముఖ‌త తెలుపుతూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెంక‌ట‌రెడ్డి చెప్పారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా హుజూర్ న‌గ‌ర్లో టీఆర్ఎస్ కి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అనుకున్నామ‌నీ, అప్ప‌టికి ఆర్టీసీ కార్మికుల స‌మ్మె మొద‌లుకాలేద‌ని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయ‌మైన‌ డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కూ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌ని చాడా వెంక‌ట రెడ్డి స్పష్టం చేసారు. 

సీపీఐ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డం టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే హుజూర్ న‌గ‌ర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ని ఓడించడం అంత తేలిక కాదు. అందుకే టీఆర్ఎస్.. సీపీఐ ఓటు బ్యాంకుపై ఆధార‌ప‌డాల‌నుకుంది. కానీ, ఇప్పుడు సీపీఐ ప‌క్క‌కి త‌ప్పుకుంది. సీపీఐ తాజా నిర్ణ‌యంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అయితే, టీఆర్ఎస్ కు దూర‌మైన సీపీఐ.. మరి కాంగ్రెస్ కి మ‌ద్ద‌తు ఇస్తుందా? లేక వేరే ఏదైనా పార్టీకి మద్దతిస్తుందో చూడాలి.

Teluguone gnews banner